యుద్ధ కాండ
ముప్పై ఏడవ రోజు ప్రవచనము
తదఽద్భుతం రాఘవ కర్మ దుష్కరం
సమీక్ష్య దేవాః సహ సిద్ధ చారణైః ఉపేత్య రామం సహితా మహర్షిభిః సమఽభ్యషించన్ సుశుభై
ర్జలైః పృథక్ ! జయస్వ శత్రూన్ నరదేవ మేదినీం స సాగరాం పాలయ శాశ్వతే స్సమాః ఇతీవ
రామం నర దేవ సత్కృతం శుభై ర్వచోభి ర్వివిధై రఽపూజయన్ ! నూరు యోజనముల సముద్రానికి సేతువుకట్టి రామ చంద్ర మూర్తి వానరసహితులై ఆ
సముద్రాన్నిదాటి ఉత్తరతీరాన్ని చేరుకున్నారు, ఉత్తరతీరాన్ని చేరుకున్నతరువాత
అద్భుతము దుష్కరము అయినటువంటి ఆ కార్యాన్నిచూసినటువంటివారైన దేవతలూ సిద్ధులూ
చారుణులు మహర్షులూ మొదలైనటువంటివారు వేరు వేరుగా పవిత్రజలములతో రామ చంద్ర మూర్తిని
అభిషేకించి ఆయనతో ఒకమాట అంటూన్నారు నాలుగు సముద్రములవరకు వ్యాపించినటువంటి ఈ భూమండలానంతటినీ
కూడా రామా! మీరు చాలాకాలం పరిపాలించవలసినదీ అని ఆయనకి ఆశీర్వచనంచేశారు. ఇక్కడా
మీరు ఒకవిషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి కథాపరంగా చూస్తే ఆయన నూరు యోజనముల
సముద్రాన్నిదాటారు. సరే ఆవిషయం అలా ఉంచండీ ఇక్కడ గమనించవలసినటువంటి ప్రధానమైన
విషయం ఏమిటంటే రామునికి వచ్చినటువంటి ఆపద సామాన్యమైందికాదు, రాముడు ఇప్పుడు
సాధించవలసి కార్యమూ అంత తేలికైనదికాదు కానీ రామునికి ఎవరూ ఎక్కడా ఎన్నడూ
ఊహించడానికి వీలులేనిరీతిలో భూతములన్నీ సాయంచేస్తున్నాయి.
ప్రధానంగా వానరులు సాయంచేశారు,
సముద్రుడు సహకరించాడు, నళుడు ఒకమాట అంటాడు సముద్రుడిగురించి “చాలాగర్వము కలిగినటువంటివాడు
నీవు బాణమును విడిచిపెట్టావు కాబట్టి మాటవిన్నాడుకానీ లేకపోతే
మాటవినేస్వభావమున్నవాడుకాడూ” అంటాడు అటువంటి సముద్రుడు కూడా ఆయనకి సహకరించాడు,
నీవు సేతునిర్మాణాన్ని ప్రారంభచేయి నేనువహిస్తానుదాన్ని అన్నాడు. ఇప్పుడూ
పంచభూతములలో జలమూ ఆయనకి ఉపకారం చేసింది, అగాధమైనటువంటి సముద్రము జలరూపంలో ఉపకరించింది,
వానర రూపంలో భూతకోటి ఉపకరించింది, సముద్రాన్నిదాటి ఈవలి ఒడ్డుకురాగానే దేవతలూ
మహర్షులు అందరూ ఆయన్నీ విడివిడిగా పవిత్రజలాలలతో అభిషేకించి ఆశీర్వచనం చేశారు.
ఇందులో మీరు గమనించవలసిందేమిటంటే దేనికి చెయ్యాలి రామునికి ఇవన్నీ... రాముడు
ఈశ్వరుడైతే ఇవన్నీ అక్కర్లేదు, రాముడు నరుడైతే ఇవన్నీ చేయడానికి ఏదోకారణం ఉండాలి.
దేనివల్ల నరుడైన రాముడికి ఇవన్నీ కలుగుతున్నాయి, ఈశ్వరుడుగా రామున్ని చూడ్డానికి
అవకాశంలేదూ అన్నది సుస్పష్టంగా తేలిసిపోతూంది కథలో.
|

కానీ ధర్మబద్ధమైన కామమువేరు అధర్మముతో కూడుకున్నకామము వేరు,
రావణుడి పథనానికి హేతువు ఎక్కడుందంటే... నిప్పెక్కడ అంటుకూంటుందంటే ఆయనకి సీతమ్మయందు
దృష్టి ఉన్నంతకాలము ఎంతగొప్ప రక్షణలు ఆయనకు ఉన్నాయో అవన్నీచితికిపోతూ ఉంటాయి.
రాముడు ధర్మమునకు ఎంతకాలము కట్టుబడి ఉంటాడో అంతకాలము ఎంతచితికితే అంతగా
రక్షణవస్తూంది అంతరక్షణవచ్చీ మళ్ళీ నేలకుకొట్టిన బంతి ఎలాపైకిలేస్తుందో... అలా
రాముడులేస్తాడు. రావణుడు ఎన్ని రక్షణలు ఉన్నా ఆయన పడిపోతూనే ఉంటాడు ఆయనకి
రక్షణకావాలీ అంటే ఆయన ఏం చేయవలసి ఉంటుందంటే సీతమ్మపట్ల తనకున్న దృష్టిని మరల్చవలసి
ఉంటుంది. ఇప్పటివరకు ఏ దృష్టికోణంతో చూస్తున్నాడో ఆ దృష్టికోణాన్ని
విడిచిపెట్టగలిగితే అంతే రావణునిజోలికికూడా ఎవ్వరువెళ్ళరు వెళ్ళలేరుకూడా
రాముడుకూడా వెళ్ళడు కానీ ఇబ్బందంతా ఎక్కడుందంటే ఆయన ఆ దృష్టికోణాన్ని మార్చుకోడు.
మీరు ఎప్పుడు గమనించవలసింది ఏమిటంటే ధర్మబద్ధముకాని కామమునందు ప్రగాఢమైనటువంటి అనురక్తి రెండు రకాలుగా
పాడుచేస్తుంది, అనుభవముచేత ప్రయోజనమునుపొందినా అది పాపం కిందకే వెళ్ళిపోతుంది
ఖాతాలోకి, ఎందుకంటే ధర్మబద్ధంగా ఒక కోర్కెను తీర్చుకోవడంవేరు. నాకూ ఓ మంచి
పంచెకొనుకుందాం అని ఉందనుకోండి నేను ఒకపంచె కొనుక్కుని కట్టుకోవడంవేరు నాకు
అంతమంచి పంచె కట్టుకునే స్థోమతలేనప్పుడు నాకున్న పంచెతో నేను తృప్తిపొందడంవేరు,
ఇప్పుడు నేను కోర్కెనాయందు వ్యగ్రతపొందుతూందనుకోండి నేను ఎలాగైనా ఓ మంచిపంచె
కట్టుకోవాలి ఇప్పుడు నేను చెయ్యకూడనిరీతిలో ఎక్కడో
|
దొంగతనంచేసి ఓపంచె తీసుకొచ్చి కట్టుకున్నాననుకోండి ఇప్పుడు
నా కోర్కెతీరినట్లు
కనపడుతూంది, కానీ బాహ్యంలో కోర్కెతీర్చుకోవడంవల్ల ప్రయోజనం సాధించాను అని
అనుకుంటున్నది మనసు, కానీ పాపం ఎక్కడ పడుతూందివెళ్ళి జీవుడి ఖాతాతో పడుతుంది,
మీరిది జాగ్రత్తగా గమనించవలసినటువంటి అంశం.

కాబట్టి కామాన్నిన్నేంచెయ్యాలంటే
ధర్మబద్ధమైన కామంగా తిప్పేసెయ్యాలి, తిప్పేస్తే ఏమౌతుందో తెలుసాండి మోక్షానికి
మార్గమౌతుంది, మీరు శరీరాన్ని కూర్చోబెడుతారేమో మనసునేం చేస్తారు అది ఉండదుగా
ఖాళీగా... కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలంటే ఏ మనస్సు శరీరాన్ని వాడుతోందో ఆమనస్సుని
ధర్మబద్ధమైనటువంటి కామానుభవంవైపుకి మీరు ప్రచోదనం చెయ్యాలి, దీనికి లక్ష్యం
దేనివలన శుద్ధిపొందుతుందో తెలుసాండీ... అప్పుడు ఒక్కమాటతోటే పొందుతుంది తృప్తీ,
తృప్తీ అన్నది మీరు పొందవలసి ఉంటుంది అందుకే “అర్థమనర్ధం భావయ నిత్యం”
అంటారు శంకరాచార్యులవారు. అర్థమనర్ధం అంటే అర్థం అన్నివేళలా అనర్ధమనికాదు,
అర్థమునందు వ్యామోహము దాచిపెడదామన్న తాపత్రయము, ధర్మ వ్యతిరిక్తమైన మార్గములో
ఆర్జించివ్యయంచేయడం ప్రమాదం కానీ... ధర్మబద్ధమైన ఆర్జన ధర్మబద్ధమైన వ్యయము ఎప్పుడూ పాడుచేయవు మనిషిని. కామమును
మీరు ధర్మబద్ధం చెయ్యాలి అంటే “అది అధర్మం కాదు అన్నది ఏది ఉంటుందో” అది మీరు
అనుభవిస్తే... అది మిమ్మల్ని ఏమీ పాడుచేయదు అంటే నా భార్యయందు నాకు కామం
ధర్మబద్ధం, ఇదే సీతమ్మతల్లి చెప్తూంది నివర్తయ మనో మత్తః స్వజనే క్రియతాం మనః
నాకొక చెక్కరపొంగళి తినాలనుంది నాకు ఉన్నదానితో వండుకుని ఈశ్వరుడికి నైవేద్యం
పెట్టుకుని నేను తిన్నాననుకోండి ప్రసాదంగా... రేపు ఒకపనిచేద్దాం పాయసం నివేదనచేసి
అదితీసుకొని బయలుదేరుదాం శరీరాన్ని పోషించాలి కాబట్టి, పొద్దున్నే బయలుదేరేముందు
కాస్త పాయసాన్నిపుచ్చుకుని వెళ్దాం అన్నాననుకోండి, పాయసం మనంతిని వెళ్దామన్నాననుకోండి అది దోషం. పాయసం
ఈశ్వరనివేదనచేసి ఈశ్వరుని యొక్క ప్రసాదాన్ని పుచ్చుకుని వెళ్దామన్నాననుకోండి అది
ధర్మబద్ధమౌతుంది.
|

ఈ తృప్తి అన్నదాన్నివదిలారనుకోండి కామము విజ్రుంభించడానికి హేతువౌతుంది, “నాకేంలేదూ...”
అని అలవాటు చేశారనుకోండి మనసుకు ఆలోచించడం అది మనకి ఇదిలేదుగా అనదు ఏమిలేదోయ్ మనకి
అంటూ మీరు మీ స్నేహితుడితో మాట్లాడినట్లు మీ మనసుతో మాట్లాడటం అలవాటుచేశారనుకోండి, నీకేదివ్వలేదు ఈశ్వరుడు చాలామందికి ఉద్యోగాల్లేవు నీకు ఉద్యోగమిచ్చాడా...
చాలా మందికి అవయవాల్లేవు నీకు అవయవాలిచ్చాడా... చాలామందికి అనారోగ్యం తిందామంటే
తినలేరు నీకు ఈశ్వరుడు తినడానికి శక్తినిచ్చాడా... చాలామంది పాపం ఏమీ మాట్లాడలేరు
నీవు పదిమాటలు చెప్పగలిగిన అనుగ్రహం ఇచ్చాడా... చాలా మందికి కొడుకులుంటే
కూతుళ్ళులేరు కూతుళ్ళుంటే కొడుకులులేరు కొంతమందికి కొడుకులు కూతుళ్ళుకూడాలేరు నీకో
కొడుకుని కూతుర్నికూడా ఇచ్చాడా... చాలా మంది కూతురు పుడితే ఫోటో జాతకం పట్టుకుని
వెళ్లి మా అమ్మాయికి మీ అబ్బాయికి జాతకం పడుతుందేమో చూడండని వాళ్ళు అడక్కుండా నీ
దగ్గరకొచ్చి మగపెళ్ళివారువచ్చి నీ కూతుర్ని చేసుకున్నారా... నీ కొడుక్కి నీవు
ప్రాధేయపడకుండా ఓ ఉద్యోగం ఇచ్చాడా ఈశ్వరుడు ఇంక నీకేమివ్వాలే ఆయనా..? ఇంక నీకేం
కావాలంటావ్? అని మీరు అడిగారనుకోండి అదేం చేస్తుందంటే అవును నాకేంలేదు
నాకేమివ్వలేదు ఈశ్వరున్నినేన్నాయన్ని అడగను తప్పుకదూ నేను ఇది పొందడం అనుకోవడం,
ఆయన ఇవ్వవలసిందేమో నాకు ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు నాకు ఇవ్వవలసింది
ఇచ్చేస్తున్నాడుగా కాబట్టి ఇంకానాకేంకావాలి అన్నారనుకోండి మీరు చక్రవర్తి. ఉత్తర
క్షణం మీరు చక్రవర్తండీ ఎంత సంతోషమో నాకేంలేదన్నవాడు చాలా హాయిగాఉంటాడు.
|
నాకిదిలేదని అలువాటు చేశారనుకోండి మీరు ఎన్నిచ్చినాలేదనే
అంటారు అగ్నిహోత్రమును నేతితో ఆర్పలేరు- ʻతీర్చి ఆర్పలేరు తీర్చకా ఆర్పలేరు
కామాన్నిʼ అది పెద్ద బాధ, అందుకని దానికున్న
ఒకే ఒక్క మార్గమేమిటంటే ధర్మంతోనే ముడేయాలి. అదొక్కటేలేదు
రావణాసురునికి ʻధర్మంతో ముడేస్తాడు రామ
చంద్ర మూర్తిʼ, మీరు అందుకే చూడండీ
రామాయణమంతా యుద్ధకాండ ఎలా నడుస్తూందో తెలుసాండీ... ఎప్పుడెప్పుడు యుద్ధమొచ్చినా
అందరూ యుద్ధం గురించి ఆలోచిస్తారు, రావణుడొక్కడు దేంతోముడేస్తాడో తెలుసాండీ..? ఎంత
తొందరగా ఈ సీతమ్మని మాయచేసి నాదానిగా చేసుకుందామని ఆలోచిస్తుంటాడు, కామము ప్రధానము
ʻకామము యొక్క వ్యగ్రచేత
క్రోధము క్రోధమువలన యుద్ధముʼ. లేకపోతే ఈ బీజములేకపోతే అసలు అక్కడ యుద్ధంలేదు అందుకని ఎంతకాలము ఈ
బీజముంటుందో అంతకాలమే యుద్ధముంటుంది. కామము సీతమ్మ యందు వదిలిపెట్టేసి పూర్తిగా యుద్ధం
మీద దృష్టిపెట్టేశాడనుకోండి మరిచిపోతాడు కొన్నాళ్ళకి సీతమ్మవిషయం మరిచిపోతాడు
అతను, అతని బుద్ధియందు ఏదో ఒకమార్పు వచ్చేస్తుంది కానీ అతనికి ఎప్పుడూ ఏది
గుర్తుంటుందో తెలుసాండీ... అతనికెప్పుడూ సీతమ్మే గుర్తుంటుంది. ఎప్పుడూ సీతమ్మ భక్తితో
గుర్తుంటుందనుకోండి తప్పులేదు ఎప్పుడూ సీతమ్మ కామమంతో గుర్తుంటుంది అధర్మమైన
కామముతో ఇది కాల్చేసింది రావణాసురున్ని. యుద్ధకాండని మీరు యుద్ధకాండగా వినకండి
నేను యుద్ధకాండని మీతో మనవిచేసేటప్పుడు ఎందుకు ఏపాత్రకి ఎక్కడ రక్షణ కలుగుతుందీ
ఎక్కడ ఏపాత్ర అధర్మాన్ని పట్టుకుని నశించిపోతూంది మీరాలోచిస్తూండండి అందుకే ఎవరు ధర్మం పట్టుకున్నారో వాళ్ళు
విశేషమైన దుఃఖం పొందుతూంటే ఎవరో ఒకరువచ్చి వాళ్ళ దుఃఖంలోంచిపైకెత్తుతారు.
మీరు చాలా గొప్పగా మోసం చేస్తున్నాను నాకోర్కె తీర్చుకోవడానికి ఇప్పుడు నేను పన్నిన
వ్యూహాన్ని ఛేదించడం ఎవరికీ సాధ్యంకాదని, అధర్మాన్ని పట్టుకుని వ్యూహరచన చేసినవాడు
చాలాబాగా సాధించేస్తున్నాను అనుకునేటప్పటికీ వైక్లవ్యం వచ్చేస్తుంది.

అక్కడా రావణుడూ... మహర్షి ఇద్దరినీ
చూపిస్తుంటారు ఓ సర్గలో ఆయన్ని చూపిస్తారు ఓ సర్గలో ఈయన్ని చూపిస్తారు. ఇది ఎలా
ఉంటుందంటే... మీరు శ్రీరామాయణాన్ని చదివేటప్పుడు మీరుబాగా నిషితంగా చదువుకుంటే
మీకొక గొప్పనాటకాన్ని చూస్తున్నట్లౌతుంది. ఇప్పుడు ఆయన అవధికని ఎటువైపు ఎత్తారంటే
రావణాసురుని యొక్క అంతఃపురంవైపుకు తీసుకెళ్ళారు, ఆయనా సమగ్రం సాగరం తీర్ణం
దుస్తరం వానరం బలమ్ ! అభూత పూర్వం రామేణ సాగరే సేతు బన్ధనమ్ !! రాముడు ʻనూరు యోజనముల సముద్రాన్ని సేతువుకట్టిదాటాడు వానరులతోʼ అన్నవిషయం రావణునికే ముందుతెలుస్తుంది ఎందుకంటే ఆయన
ఏంచేస్తున్నాడో తెలుసుకోవాలన్ని కుతూహలమున్నవాడు ఈయనె, కాబట్టి తెలుసుకున్నాడు
ఇప్పుడు అమాత్యులను పిలిచాడు, శుఖ సారుణులని అమాత్యులు. అమాత్యులు ఎందుకుంటారు ఓ
మంచిమాట చెప్పడానికి ఉంటారు, వాళ్ళని
చెప్పనివ్వడు చెపితే వినడు, చెబితే వినకపోవడమన్న క్రోధం ఎక్కడ్నుంచి
వచ్చిందంటే అదిగో బీజమక్కడ ఉంది అది ఆయన పాడైపోవడానికి ప్రధానకారణం. కాబట్టి
ఇప్పుడు సమగ్రం సాగరం తీర్ణం ఆ అమాత్యులతో అంటున్నాడు ఇంత దుష్కరమైనటువంటి
సముద్రాన్ని రాముడు దాటాడు, ఒక మహాజలధియైనటువంటి సముద్రం మీద సేతువుకట్టడమూ అంటే అనూహ్యము
అసలు ఎవరూ ఊహించలేరు అలా జరుగుతూందీ అని అనుకోరు అటువంటి సేతునిర్మాణం చేశాడు చేసి
ఇంత వానరబలంతో సముద్రాన్నిదాటి ఈవలి ఒడ్డుకు వచ్చాడు.
సాగరే సేతు బన్ధం తు న శ్రద్దాధ్యాం
కథంచన ! అవశ్యం చాఽపి సంఖ్యేయం త న్మయా వానరం బలమ్ !! నేను ఇంతమంది వానరులతో కలసి ఇంత సంఖ్యాబలం కలిగినటువంటి వానరులతో రాముడు
సముద్రాన్నిదాటాడూ అన్నమాటా ఇప్పటికీ నాకు నమ్మశక్యంగాలేదు, అంతే కొన్ని కొన్ని
అలాగే ఉంటాయ్ నమ్మశక్యంగా ఉండవు కానీ నమ్మశక్యంకానివి నమ్మవలసిన విషయాలుగా ఎప్పుడొస్తాయి అవతలివాడి యొక్క
ధర్మమునుబట్టి వస్తాయి. ఈమాట అని ఆయన అన్నాడు మీ ఇద్దరూ కూడా నాకొక ప్రయోజనాన్ని
సాధించాలి, మీ ఇద్దరూ ఇప్పుడు ఇక్కడ్నుంచి బయలుదేరి దక్షిణ తీరానికి చేరిపోయింది
కాబట్టి వానరబలం, మీరు రామ చంద్ర మూర్తి యొక్క సైన్యంలోకి ప్రవేశించండి, మీరు కూడా
ఆ సైన్యంలో కలిసిపోండి వానర రూపాలలో కలిసిపోయి అక్కడ ఎవరున్నారు ఎవరెవరు ఎంత
బలవంతులు ఎవరివెనక ఎంతమంది అనుచరులున్నారు ఎవరెవరి సామర్థ్యమెటువంటిది ఎవరెవరు ఏ
విధంగా వ్యూహరచన చేస్తున్నారు ఈ విషయాలన్నింటినీ బాగా తెలుసుకుని నాదగ్గరికిరావలసింది
అని. ఇప్పుడా శుక సారుణులిద్దరూ వానరరూపాలను ధరించి వానరసైన్యంలో కలిసిపోయారు,
ఇన్ని కోట్ల కోట్ల వానరములన్నీ ఒకచోటనుంచి వచ్చినవికావు ఒక్కొక్కరు ఒక్కొక్క
చోటనుంచి భూమండలమంతట్నుంచీ ఆ వానరములను తీసుకొచ్చారు. ఋషభుడు ఆయన కొంతమందిని
గందమాధనుడు ఆయన కొంతమందిని గవయుడు ఆయన కొంతమందిని ద్వివిధమైందులు వాళ్ళు
కొంతమందిని ఇలా తీసుకొచ్చారు కాబట్టి గుర్తుపట్టే అవకాశం ఉండదు, కానీ వాళ్ళల్లో
కలిసిపోయారు కలిసిపోతే ఈ రాక్షసమాయను కనిపెట్టగలిగినవాడు ఎవరు ఈ రాక్షసమాయలు
తెలిసున్నవాడే కనిపెట్టాలి, లేకపోతే అమాయకులైన వానరులు కనిపెట్టలేరు ఈ రాక్షస
మాయను భేదించి చూడగలిగిన శక్తి ఉన్నవాడు ఒక్క విభీషణుడే.
|
కాబట్టే ముందే ఈశ్వరుడు విభీషణున్ని పుట్టేటట్టుచూసి
విభీషణుడు దేశకాలాదులననుసరించి ఎప్పుడు రామ చంద్ర మూర్తి దగ్గరికి వెళ్ళేటట్టుగా
అనుగ్రహించాడు కనుక ఈశ్వరుడన్నవాడు ఒకడున్నాడు వాడు నిర్వహిస్తున్నాడు
కార్యానంతట్నీ కాబట్టి ఇప్పుడు ఎవరు పట్టుకోవాలి వానరులు పట్టుకోలేరు, రాక్షసులు ఆ
రూపంలోవస్తే విభీషణుడు ఒక్కడే పట్టుకోవాలి కాబట్టి విభీషణుడు ఇతి ప్రతిసమాఽఽదిష్టౌ
రాక్షసౌ శుక సారణౌ ! హరి రూప ధరౌ వీరౌ ప్రవిష్టౌ వానరం బలమ్ !! వానర రూపాలతో
వానరులలో ప్రవేశించినటువంటి రాక్షసులైన శుక సారుణుల్ని విభీషణుడు గుర్తించాడు
గుర్తించి పట్టుకున్నాడు పట్టుకుని గుర్తుపట్టాడు తౌ దదర్శ మహా తేజాః
ప్రచ్ఛన్నౌ చ విభీషణః ! ఆచచక్షేఽథ రామాయ గృహీత్వా శుక సారణౌ !! వానర రూపాలతో
వాళ్ళలో కలిసినటువంటి రాక్షసుల్ని పట్టుకుని వధించే ప్రయత్నాన్నిపొంది
కోపించినవాడై వీళ్ళిద్దర్నీ ప్రభువైన రామ చంద్ర మూర్తి దగ్గర ప్రవేశపెడతానని
ఇద్దర్నీ తీసుకెళ్ళి ఆయన దగ్గర నిల్చోబెట్టాడు. మీరు ఇక్కడే చమత్కారమొకటుంది
విభీషణుడు ధర్మాత్ముడే కానీ ఆయన ప్రభు భక్తివలన ఆయన ఏమనుకున్నాడంటే వీళ్ళి ఇద్దరూ
చేస్తున్నది తప్పు కాబట్టి వీళ్ళిద్దరూ వధకు అర్హులు ఇదీ ఆయన యొక్క బుద్ధివ్యగ్రత.
కాబట్టి ఆయన పట్టుకున్నాడు ఆయన కూడా పరమ ధర్మాత్ముడు అందుకే పట్టుకున్నవెంటనే
చంపేద్దామన్న ఉద్రేకం కలుగలేదు ఆయన ధర్మం ఎంతవరకు తీసుకెళ్ళి ప్రభువుదగ్గర
ప్రవేశపెట్టడంవరకు ప్రభువు ఏ శిక్ష వేస్తే అది వేస్తాడు. నేను నీకు శరణాగతి
చేస్తున్నాను నేను నీవెంట ఉంటాను నేను నీకు చెయ్యగలిగిన సాయం చేస్తానని అన్నవాడు
శత్రుపక్షం నుంచి వచ్చినటువంటివాళ్ళను శత్రు పక్షంగా గుర్తుపట్టడమంటే మనవాళ్ళే
అన్నమాట ఇంకరాకూడదు, ఏమాటరావాలి మనసులో వీడు పరాయివాడన్నభావన రావాలి. వచ్చి
ఎంతసేపైందన్నదికాదు ఆమాట అంతే ఆ చమత్కారం రావాలంటే మనసులో ఆ బుద్ధియందు అత్యవసాయం
ఉండాలి.

|
కానీ రాముడు అన్నాడు యది దృష్టం బలం కృత్స్నం వయం వా
సుపరీక్షితాః ! యథో క్తం వా కృతం కార్యం ఛన్దతః ప్రతిగమ్యతామ్ !! మీరు ఏ
ప్రయత్నంమీద ఇక్కడికివచ్చారు మా వానరసైన్యమంతా ఎంతుంది ఎంతెంత బలలవంతులున్నారు ఇది
చూడ్డానికి కదావచ్చారు అది అయిపోయిందా చూడ్డం, బాగా చూశారా లేకపోతే ఇంకా
చూడవలసినవి ఏమైనా ఉండిపోయాయా... అథ కించి దఽదృష్టం వా భూయ స్త ద్రష్టు మర్హథః !
విభీషణో వా కార్త్స్యేన భూయ స్సందర్శయిష్యతి !! ఒకవేళ మీరు చూడవలసినది ఏదైనా
ఇంకా మిగిలిపోయి ఉంటే మీరు పూర్తిగా చూసి ఉండకపోతే నాకు చెప్పండీ విభీషణున్ని
ఇచ్చి పంపిస్తాను ఇంకా మీరు ఏవేవి చూడలేదో అవన్నీ మీకు చూపిస్తాడు. ఇప్పుడు వాళ్ళు
తెల్లబోయారు ఇదేమిటీ మమ్మల్ని చంపవలసినవారు ప్రాణాలతో విడిచిపెట్టడం కాకుండా మీకు
విభీషుణుడు సాయమిస్తాడు చూపిస్తాడు వానర సైన్యాన్నంతటినీ చూసిరండి అంటాడేమిటీ అని న
చేదం గ్రహణం ప్రాప్య భేత్తవ్యం జీవితం ప్రతి ! స్యస్త శస్త్రౌ గృహీతౌ వా న దూతౌ వధ
మర్ఙథః !! నీ దగ్గర అస్త్రములులేవు శస్త్రములులేవు అస్త్ర శస్త్రములు
లేనివాన్ని చంపడం ధర్మంకాదు కాబట్టి ఆ కారణంచేత మిమ్మల్ని నేను చంపను పైగా మీరు
రావణాసురునిచేత వినియోగింపబడ్డారు వెళ్ళిచూసిరమ్మని ఇప్పుడూ నేను కొన్నిమాటలు
చెప్తాను వెళ్ళి రావణునికి చెప్పండి ఇప్పుడు ధూత కృత్యంలో ఉన్నవారు కాబట్టి
మిమ్మల్ని అస్సలు చంపకూడదు, అస్త్ర శస్త్రములు లేనివారు కాబట్టి మిమ్మల్ని అస్సలు
చంపను ప్రాణములకోసం నా దగ్గరకొచ్చి ప్రార్థనచేసి ఏడ్చినవానిని నేను చంపుతానా చంపను
కానీ మీరు ఏ కార్యం మీద వచ్చారో ఆ కార్యం కూడా పూర్తి చేసుకునివెళ్ళండి చూడకపోతే
చెప్పండి మీరు అన్ని చూద్దురుకానీ నేను విభీషణున్ని ఇచ్చి పంపిస్తాను.

|
బాహ్య బలం ఎక్కువనుకోండి శ్లాగించవచ్చు శ్లాగించకపోవచ్చు
కానీ యుద్ధానికి వచ్చినప్పుడు కూడా ఇంత ధార్మికంగా నిలబడగలిగినటువంటి లక్షణం ఉండడం
ఎప్పుడూ ధార్మికంగా
జీవించగలగడం మనిషి ఎంత కృతకృత్యుడై లోపల ఎంత ధృతికలిగినవాడైతే తప్పా సాధ్యమయ్యే
విషయంకాదు కాబట్టి ఆ వచ్చినటువంటి శుక సారుణులు ఇతి ప్రతిసమాఽఽదిష్టా
రాక్షసా శుక సారణౌ ! జయేతి ప్రతినంద్యై తౌ రాఘవం ధర్మ వత్సలం ! ఆగమ్య నగరీం లంకాం
అబ్రూతాం రాక్షసాఽధిపమ్ !! వాళ్ళు జయ జయ ధ్వానములతో రామ లక్ష్మణులకి ఇద్దరికీ
కూడా ఆశీర్వచనంచేసి మీకు జయము కలుగుగాకా అని మంగళ కరమైన వాక్కు పలికి అక్కడ్నుంచి
బయలుదేరి లంకాపట్టణాన్ని చేరారు. చేరిన తరువాత రావణుడు వీళ్ళను చూశాడు ఇప్పుడు ఒక ధర్మ
నిష్టకలిగినటువంటివాన్ని చూసి ఇంత అధర్మాత్ముడైనటువంటివాన్ని చూసి ఇద్దరి మధ్యా
ఉన్న భేదాన్ని గుర్తించినవాడు ఆ కోణంలో మాట్లాడకుండా ఉండలేరు కదాండీ! అలా
మాట్లాడకుండా ఉండగలిగారనుకోండి అతను కూడా ఇంకోరావణాసూరుడనిగుర్తు. కాబట్టి ఇప్పుడు
వాళ్ళు నీవు చూసి రమ్మన్నావుకదా మేము చూసివచ్చాము ఆ బలాన్ని నీకు చెప్పలేము అంత
వానర బలం అసలు మేము దైన్యాన్ని పొందాం భయమేసింది ఆ వానరుల్నిచూస్తే గుహలు పర్వతాలు
శిఖరాలు వనాలూ అంతటా నిండిపోయింది ఆ వానరసైన్యం. అంత సైన్యంతో ధీరోద్ధతుడైనటువంటి
రామ చంద్ర మూర్తి లక్ష్మణ మూర్తితోకలిసి వచ్చి ఉన్నారు కాబట్టి యుద్ధంలో నీవు
జాగ్రత్తపడవలసి ఉంటుంది నీకు రెండే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి సీతమ్మని
పట్టుకెళ్ళి ఇచ్చేయడం రెండు వాళ్ళు యుద్ధానికి రాకముందే నీవు నీవు యుద్ధానికి దిగి
నిగ్రహించే ప్రయత్నం చేయడం రావణా! నీవు ఆ ప్రయత్నం చేయవలసి ఉంటుంది.

|
య శ్చైషోఽనన్తరః శూరః శ్యామః
పద్మనిభేక్షణః ! ఇక్ష్వాకూణా మఽతిరథో లోకే విఖ్యాత పౌరుషః !!
యస్మి న్న చలతే ధర్మో
యో ధర్మం నాఽతివర్తతే ! యో బ్రహ్మ మఽస్త్రం వేదాం శ్చ వేద వేదవిదాం వరః !!
యో భిన్ద్యా ద్గగనం
బాణైః పర్వతాం శ్చాఽపి దారయేత్ ! యస్య మృత్యో రివ క్రోధః శక్రస్యే వ పరాక్రమః !!
యస్య భార్యా జనస్థానా త్సీతా చాఽపహృతా త్వయా ! స ఏష రామ
స్త్వాం యోద్ధుం రాజన్ సమఽభివర్తతే !!

య శ్చైష దక్షిణే
పార్శ్వే శుద్ద జామ్బూ నద ప్రభః ! విశాల వక్షా స్తామ్రాఽక్షో నీల కుంచిత మూర్ధజః
!!
ఏషోఽస్య లక్ష్మణో నామ
భ్రాతా ప్రాణ సమః ప్రియః ! న యే యుద్ధే చ కుశలః సర్వ శాస్త్ర విశారదః !!
అమర్షీ దుర్జయో జేతా
విక్రాన్తో బుద్ధిమాన్ బలీ ! రామస్య దక్షిణో బాహు ర్ని త్యం ప్రాణో బహి శ్చరః !!
న హ్యేష రాఘవస్యాఽర్థే జీవితం పరిరక్షతి ! ఏషై వాఽఽశంసతే
యుద్ధే నిహన్తుం సర్వ రాక్షసాన్ !!
|
ఆ పక్కన నిలబడ్డాడే రామ చంద్ర మూర్తికి పోతపోసినటువంటి
బంగారు వర్ణంలో ఉన్నాడే ఆయనే లక్ష్మణ మూర్తి, ఆయనా రామ చంద్ర మూర్తి యొక్క
బహిప్రాణం లోపల తిరిగే ప్రాణం మనకు కనపడదు రామునికి బయట తిరిగే ప్రాణంతో
సమానమైనవాడు. రామ కార్యం మీద అవసరమైతే తన ప్రాణములనైనా విడిచిపెట్టాలనేటంతటి పూనిక
ఉన్నవాడు. ఆ లక్ష్మణుడు మిగిలిన ఎవ్వరి సహకారంలేకుండా తానొక్కడే ఈ రాక్షలులందర్నీ
మట్టుపెట్టాలన్నంత గొప్ప సంకల్పబలంతో ధృడ దీక్షతో ఉన్నాడు అని య స్తు సవ్య మఽసౌ
పక్షం రామ స్యాఽఽశ్రిత్య తిష్ఠతి ! రక్షో గణ పరిక్షిప్తో రాజా హ్యేష విభీషణః !!
వాళ్ళన్నారు అదిగో రాముడి పక్కన నిలబడి ఉన్నాడే నీకు తెలుసు ఆయనే రాజైన విభీషణుడు
అన్నారు. ఇదీ చురుక్కుమంటుంది కదాండి రావణాసురునికి, తన తమ్ముడు తనని
విడిచిపెట్టివెళ్ళాడు, దేనికిరాజు వాళ్ళు దేనికిరాజో చెప్తున్నారు ఎందుకు
చెప్తున్నారు అలా రాచపదవిని రాముడు అనుగ్రహించాడు ఆయనకి అది ఆయనకు చెందకూడదంటే
నీవు ధర్మం పట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు వాళ్ళన్నారూ శ్రీమతా రాజ రాజేన
లంకాయామ్ అభిషేచితః ! త్వా మేవ ప్రతిసంరబ్ధో యుద్ధాయైషోఽభివర్తతే !! వాళ్ళ
దృష్టికోణంలో చూసినప్పుడు ఆయన రాజైన విభీషణుడే రాజైన విభీషణుడు రాముని పక్కన
నిలబడి ఉన్నాడు ఆయన కూడా నీమీద క్రోధంతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే అసలు
యుద్ధం మొదలవకముందే నీవాడన్నవాడొకడు నీతోడబుట్టినవాడొకడు రామునిపక్కన చేరిపోయాడు
అటువైపునున్నవాడొక్కడుకూడా నీ పక్కకు వచ్చినవాడులేడు అని య స్యైషా కాంచనీ మాలా
శోభతే శత పుష్కరాః ! కాన్తా దేవ మనుష్యాణాం యస్యాం లక్ష్మీః ప్రతిష్ఠితా !! ఏతాం చ
మాలాం తారాం చ కపి రాజ్యం చ శాశ్వతమ్ ! సుగ్రీవో వాలినం హత్వా రామేణ ప్రతిపాదితః
!! అదిగో ఆ పక్కన స్థిరంగా నిలబడి ఉన్నాడే ఆయనే సుగ్రీవుడు ఆ సుగ్రీవుడు రాజ్యభ్రష్టుడై
ఋష్యమూక పర్వతంమీద తిరుగుతూంటే రామ చంద్ర మూర్తి ఒక్క బాణంతో వాలినిసంహరించి ఆయన
మెడలో ఉన్నటువంటి నూరు పద్మములతో కూడినటువంటి మాలని దేవేంద్ర దత్తమైన మాలనీ వాలి
మెడలోంచి సుగ్రీవుని మెడలోకి చేరేటట్టుగా చేశారు.
ఆ మాల సామాన్యమైన మాలకాదు దానియందు
దేవతల యొక్క ʻశ్రీʼ అంటే దేవతల యొక్క లక్ష్మీ మనుష్యుల యొక్క లక్ష్మి రెండు
లక్ష్ములు కలిపి ఒక లక్ష్మిగా ఆ మాలని అలంకరించి ఉంటాయి ఆ మాలయందు నిక్షిప్తమై
ఉంటాయి, అటువంటి మాలా వాలి మెడలోంచి సుగ్రీవుని మెడలోకి రావడానికి కారణం రాముడే
అలాగే తార సుగ్రీవుడి పక్కకి రావడానికి కారణం రాముడే రుమ మళ్ళీ సుగ్రీవున్ని
పొందడానికి కారణం రాముడే వానర రాజ్యం సుగ్రీవుడు పొందడానికి కారణం రాముడే అదిగో
అలా రామునిచేత సమస్తమూపొంది ఆనందించి కృతజ్ఞాతాభావమనుపించుకున్నటువంటి కింకరుడైన
సుగ్రీవుడు పక్కననిలబడి ఉన్నాడు. ఇవన్నీ రామ చంద్ర మూర్తి సాధించినటువంటి విజయాలు
ఇంక కనుచూపుమేర అలా అసలు అందనంతవరకు కనపడుతూంది చూశావా సైన్యం ఆ సైన్యం ఎంత ఉంది
అన్నదానికి సంబంధించి మాకు అందిన లెక్కలో నీకు చెప్తాం విను అనివాళ్ళన్నారు. గణిత
శాస్త్రజ్ఞులు చాలా పెద్ద సంఖ్యలు చెప్పవలసి వస్తే కొన్నింటిని వాడుతూంటారు నూరు
లక్షలు ఒక కోటి, లక్ష కోట్లు ఒక శంఖము, లక్ష శంకములు ఒక మహాశంకము, లక్ష మహాశంకములు
ఒక బృందము, లక్ష బృందములు ఒక మహాబృదము, లక్ష మహాబృందములు ఒక పద్మము, లక్ష పద్మములు
ఒక మహాపద్మము, లక్ష మహాపద్మములు ఒక ఖర్వము, లక్ష ఖర్వములు ఒక మహాఖర్వము, లక్ష
మహాఖర్వములు ఒక సముద్రము, లక్ష సముద్రములు ఒక హోగము, లక్ష హోగములు ఒక మహోగము ఈ
విధముగా వేయి పద్మములు వేయి కోట్లూ నూరు శంకములు మహాశంకములు వంద బృందములు వేయి మహాబృందములు
వంద పద్మములు వేయి మహాపద్మములు వంద ఖర్వములు నూరు సముద్రములు వంద మహోగౌములు కోటి
మహోగౌములు ఇలా ఇంకనేను చెప్పడం సంఖ్య నాకు చెతకాదులే రావణా! అంత వానర సైన్యం ఉంది
అనిచెప్పారు.
|

ఆ శుక సారుణులిద్దరూ రాజుకి విజయీభవ
విజయీభవా అంటూ... సిగ్గుతో తలవంచుకుని మెల్లమెల్లగా అడుగులువేసి వెళ్ళిపోయారు, అంటే
ఒకరు నిజానికి తమ ప్రభువుకారు ʻరామ చంద్ర మూర్తిʼ ఇంకొకరు తమ ప్రభువని నమ్మి ఊడిగము చేస్తున్నవారు. ఇప్పుడూ వీళ్ళు ఎవరికి
ఊడిగం చేస్తున్నారో ఆయన ధర్మమెంతగొప్పదో తెలిసింది, వీళ్ళు
శత్రువనుకుంటున్నవాడెవరో ఆయన ధర్మం ఎంతగొప్పదో కూడా వాళ్ళకీ అర్థమైంది. ఇటువైపు
రావణాసురుని యొక్క ప్రవృత్తినీ చూశారు అటు రామ చంద్ర మూర్తి యొక్క ప్రవృత్తినీ
చూశారు ఆయనా (రాముడు) మీరు ఇంకా చూశారో చూడలేదో బాగా చూడండని చెప్పాడు, రావణుడూ...
ʻచూసొచ్చిన విషయాన్ని
ఆయనే వేలుపెట్టి చూపించి చెప్పమంటే చెప్పిన విషయానికి కృద్ధుడైʼ మిమ్మల్ని చంపకుండా విడిచిపెడుతున్నాను ఇంకెప్పుడు నాకు
కనిపించకండని అన్నాడు. అంటే...
|
రావణాసురుని యొక్క శీలాన్ని ఆవిష్కరించడానికి రామ రావణుల్ని ఇద్దరి యొక్క
ధర్మాల్నీ ఇద్దరి యొక్క నడవడిని పోల్చడానికి ఎంతగొప్పగా మహర్షీ పక్క పక్కనే ఈ
విశేషాలన్నింటినీ కూడా వర్ణణ చేస్తారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన
తరువాత అక్కడ ఉన్న సచివుల్ని పిలిచాడు, పిలిచి ఒక గూఢచారిని పిలవండి పిలిచి ఆ
గూఢచారుల్ని రామ చంద్ర మూర్తి యొక్క సైన్యంలోకి పంపి ఆ బలా బలముల యొక్క విచారణ చేయించండి
అంటే మీరు ఇప్పుడు ఏం తెలుసుకోవలసి ఉంటుంది. ఎందుకు అన్నిమాట్లు పంపడం అక్కడ
అంతుందనుకోండి మీరు ఎన్నిమాట్లు వెళ్ళొచ్చినా అంతే ఉంటుంది కదాండీ ఇంకా యుద్ధం
ప్రారంభంకాలేదుకదా పోనీ అటు తరిగి పోయిందనుకోవడానికి అంతే ఉంటారు వాళ్ళ బలం అలాగే
ఉంటుంది.
అంటే రావణాసురునికి కావలసిందేమిటంటే
సత్యంకాదు తనకు ప్రీతిగా మాట్లాడాలి ఇదే విభీషణుడు చెప్పాడు నీలో ఉన్న దోషమేమిటో
తెలుసా..? నీకు ఏది ప్రీతో
అది వినాలని కోరుకుంటావ్, ఏది ధర్మమో అది వినాలని కోరుకోవట్లేదు ఇది మనిషి జీవితంలో
పెద్ద శాపము ప్రిజిడీస్ అంటూంటారు ఇంగ్లీష్ లో అంటే ఏమౌతుందంటే ఏదో
కారణానికి అభిమానముంటుంది ఒకొక్కసారి ఆ అభిమానానికి కారణం చెప్పడం కూడా కష్టం,
కానీ ఏదో ఒకటంటే ఇష్టం ఇప్పుడేమౌతుందంటే ఎప్పుడూ తను ఏం కోరుకుంటాడంటే అటువైపు
శుభవార్తేవినాలని కోరుకుంటాడు అది అధర్మమేకానివ్వండీ శుభంగా ఉండాలని కోరుకుంటాడు.
ఇప్పుడు అది శుభప్రదంగాలేదూ అన్నమాట చెప్పడం సత్యం అది బలంగా ఉందీ బలంగా ఉందీ
అవతలవైపు పక్షం అనీ ఎవరైనా చెప్తున్నారనుకోండి ఈయ్యనకి ప్రీతికరంగా ఉండదది
కారణమేమిటంటే తన ప్రీతీ తన అప్రీతి పక్కనపెట్టండి ఉన్న విషయాన్ని ఉన్నట్టు సహేతుకంగా చూడగలిగిన ప్రజ్ఞ ఉంటే
నీవు రాగద్వేషములతో అతుక్కోకుండగా కేవలం సాక్షిగా గుణదోషములను విచారణచేసి దానివరకు
ఎక్కడ వరకు గొడవుందో అక్కడ వరకు ఎక్కడ వరకు దోషముందో అక్కడవరకు ఖండించి
నిలబడగలిగితే నీ ప్రాజ్ఞ అది. కానీ గుణమూ దోషముతో సంబంధములేకుండా
దోషములనుకూడా గుణంగా చూడాలనే ప్రవృత్తి బయలుదేరిందనుకోండి అవతలివాడికి ఏమీ అవదు
మీరే పాడైపోతారనిగుర్తు చాలా ప్రమాదకరమైన ధోరణి అది. ఒక్కే ఒక్క మనః ప్రవృత్తిలో
చాలా చాలా దోష భూయిష్టమైన విషయాలు అందుకే మీరు చూడండీ ఎప్పుడూ ఎంతమంచివాడవనివ్వండీ
ఒకాయనంటే ఎట్టిపరిస్థితితుల్లోను ఇష్టపడరు కొంతమంది ఆయన ఎంత ధర్మాత్ములుకానివ్వండీ
ఎంత మంచికానివ్వండి ఆయన పేరుచెప్తే ఇష్టపడరు ఎందుకలా ఇష్టపడకుండా ఉండడం అంటే లోపల
పట్టుకున్నటువంటి రాగద్వేషాలు దీనివల్ల ఏమౌతుందంటే... అసలు ఎట్టి పరిస్థితుల్లో
మీరు గుణమును చూడకుండా మీ దృష్టికోణాన్ని అడ్డేస్తుంది.
ఇప్పుడూ ఈ కళ్ళజోడుమీద ఒక చమట
బిందువు పడిందనుకోండి నాకు కనపడదు నేను తీసి మళ్ళీ దాన్ని తుడ్చుకుని పెట్టుకోవాలి
బుద్దిని కూడా ఎప్పుడు ఒక
మసక ఒక తెర అద్దమును మకిలిబాధించినట్లు ఒక మూత మూస్తుంటుంది అదేమిటో తెలుసాండీ
పక్షపాతము, అది చాలా చిత్ర విచిత్రంగా చేరిపోతుంది మనసులోకి అది ఎందుకు చేరుతుందీ
అంటే మీరు సాధికారికంగా కూడా చెప్పడం చాలా కష్టం. కానీ మనిషి విచారణచేత
దాన్నిగెలవగలిగి ఉండాలి అలా విచారణచేసి గెలవలేకపోయాడనుకోండి ఏమౌతుందో తెలుసాండీ
అది బుద్ధియందు ఒక వైక్లవ్యంగా ఉండిపోతుంది, అది అంత మంచిపద్ధతాంటే
మంచిపద్ధతికాదు. ఇదే రావణాసురునితో వచ్చిన పెద్దపేచీ అందుకని అన్నిమాట్లు అంతమందిని
పంపిస్తాడు
|
ఎవడో ఒకడువచ్చీ చ్ వాళ్ళందరెవరండీ కోతులు వాళ్ళందరినీ మీరు ʻమీరు వెల్లాలాలేంటీ?ʼ ప్రహస్తుడుచాలని ఎవరైనా అన్నారనుకోండి వెంటనే ఓ కంకణం తీసి
ఇస్తాడువాడికి అది సత్యమా అసత్యమా ఆయనకు అనౌసరం. అది అసత్యమని ఆయనకు తెలుసు
లేకపోతే ఈమాట ఎందుకన్నాడు. నేనెప్పుడు వినలేదూ నూరు యోజనములు సముద్రాన్నిదాటి ఎలా
వచ్చాడు రాముడు ఇది దుస్సాద్యమైన కార్యమన్నాడు అంటే... ఎక్కడో మనసులో కుళ్లు ఉంది
దానిని మూసేస్తారు లోపలే దాన్ని అలా మాట్లాడనివ్వడు. దాన్ని అలా స్వేచ్ఛగా చక్కగా
నిష్పక్షపాతంగా కూర్చోనివ్వరు అలా విని నిర్ణయం చేయనివ్వడు ఇలా మూసేస్తుంటే
ఏమౌతుందో తెలుసాండీ..! దానివల్ల పథనం సంభవిస్తుంది అలా చేసుకోకూడదు అది యుక్తా
యుక్త విచక్షణతో మంచిమాట మీలోంచే వస్తుంది ఎక్కడ్నుంచో వస్తుందని మీరు అనుకోకండి.

దానికి సిద్ధంగా ఆయన ఉండడు అందుకే
ఆయనకి శత్రువులని కీర్తించడం కింద వినిపించింది తప్పా అన్నన్నా అంతగొప్పవాళ్ళే
అందుకు కదురా రాగలిగారువాళ్ళు అందుకు కదురా హనుమ రాగలిగారు, నిజమే ఇదేదో
ఆలోచించవలసిన విషయమే, వీళ్ళందరూ వస్తే నా తరుఫున మిగిలినవాళ్ళు యుద్ధం చేస్తే ఏ
కారణానికి వీళ్ళందరూ చచ్చిపోవాలి, తీరితేనాది కామం తీరకపోతే మరణించేవాళ్ళు
అమాయకులు ఇన్నికోట్లమందిపోతారు లంకపోతూంది నా ఒకడి కోసం దేశమంతా ఎందుకుపోవాలి.
కాబట్టి ఒకడి కోసం దేశం పోవడానికి వీల్లేదు అన్న ఆలోచన ఎప్పుడు వస్తూంది అసలు ఈ
ఆలోచనలను అంగీకరిస్తే దాంట్లోంచి ఆ స్థితిలోకి వెళ్తాడు. దీన్ని అంగీకరించడు
ఎక్కడో చిన్న రవ్వ లేచిందనుకోండి అంత సేతువు ఎలా కట్టాడూ అంటాడు కాని అక్కడితో
మూసేస్తాడు అందుకే ఆ తరువాత ఏమంటాడో తెలుసాండీ... ఇది పక్ష పాతంతో కూడిన మాటా అంటే
ఎలా ఉంటుందో తెలుసాండీ అవతలివాడుచేసింది ఎంతగొప్ప పనైనా... ప్చ్ అదేముందది అంటాడు.
ఇవతలవాడు చేసింది ఎంత తక్కువైనా చాలా గొప్ప అంటాడు. ఎప్పుడూ ఒకటే చెప్తారు నేను
దేవతల్ని గెలిచాను గంధర్వుల్ని గెలిచాను యక్షుల్ని గెలిచానని కాసేపాగి ఏమంటాడో
తెలుసాండీ ఎదరా మీద సర్గల్లో చూద్దురుకాని అందుకే నేను చెప్తుంటాను రామాయణం మనస్తత్వశాస్త్రం
రామాయణాన్ని చదివేటప్పుడు రామాయణ కథా అని చదవద్దు నరుడిగా వచ్చి మనని చెక్కడానికి
వచ్చాడు దాన్ని మీ వైపు ఏవిధమైన గుణ దోషాలున్నాయో విచారణ చేసుకుని దాన్ని
దిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి లేకపోతే ఏమౌతుందంటే విన్నావా అంటే విన్నానంతే
దానివల్ల ప్రయోజనమేమైనా సిద్ధింపజేసుకున్నావా అంటే ఏమీ ఉండదు అప్పుడు ఎటుపక్కకి నిలబడిపోయినట్లౌతుంది
తెలుసాండి అది రావణుని పక్కకు వెళ్ళినిలబడినట్లౌతుంది.
|

|
ఇప్పుడూ ఇక్కడ ఎవ్వరు లేరనుకోండి అయ్యా! అందరూ లేచి
నిలబడండి అన్నాననుకోండి నన్ను పిచ్చాడంటారు కదా ఎవ్వడూ లేనిదానికి లెమ్మంటాడేంటీ
అంటారు, మీ అందరూ ఉంటే అయ్యా మీ అందరూ
లేచి నిలబడండీ అని నేను అన్నాననుకోండి దానికొక అర్థముంటుంది ఉంటేగదా ఉత్తిష్టంతు
భూత పిశాచః లేకపోతే ఉత్తిష్టంతు భూత పిశాచః ఏంటీ ఉంటేనే లెమ్మంటాం
అలాగే ఈ లోపల నుంచి కూడా... ఓ మాట వస్తూంటూంది ఎప్పుడూ మీరు గమనించగలిగితే
మిమ్మల్నిమీరు పరిశీలిస్తే చెడ్డ సంకల్పం మీరు చెయ్యగానే ప్చ్ వద్దులేదువూ వాడు
నోరుకొట్టుకుని అంత చెప్పాడు నిజమో అబద్ధమోకాని వాడు అలా ఉన్నాడోలేడో దేవుడెరుగుగానీ
ఏదో మంచనేవాడు రోజు ధర్మమనేవాడు 42 రోజులు నోరుకొట్టుకుని వెళ్ళాడుకదా..! పోల్లే
ఎందుకు వదిలిపెట్టేద్దాము అంటారు. శ్రవణము అందుకొచ్చిందండీ... శ్రవణము ప్రతి
దేవాలయంలో పురాణ ప్రవచనం ఇన్నిరోజులని ఉండేదికాదుపూర్వం ప్రతిరోజూ ప్రవచనం ఉండేది,
ప్రవచనం ఎవరుచెయ్యాలి ఏమండీ అది ప్రవచనం కోసం రావడం ప్రవచనం చెప్పి వెళ్ళిపోవడం
అలా ఏం ఉండేదికాదు. పూర్వం చక్కగా ఆయన సంధ్యావందనం చేసుకునీ ఆయన వచ్చి గుళ్ళో
కూర్చునేవారు. ఏదో ఆరోజుమంచిమాట అందరూ వచ్చి కూర్చునేవారు ఆయనా ఏదో మంచిదో అంబరీషుని
గురించి ఓ భక్తి ఓ పురుశార్థం ఆయనొగంటచెప్పి ఆయన వెళ్ళిపోయేవాడు దీని
ప్రభావమేమయ్యేదంటే మరునాడు ఉదయం జ్ఞాపకానికొస్తుండేది ధార్మికమైన జీవనం
నడుస్తుండేది. దేవాలయము
ధార్మిక జీవనమునకు ఆటపట్టు మిమ్మల్నీ ధార్మికంగా నడిపించేది దేవాలయం అలాగే
ఇక్కడ్నుంచి కూడా మీకు సంకల్పం ముందు ఇక్కడ్నుంచే వస్తూంది వద్దూ అలా చెయ్యకూ అని
కానీ ఎవడూ పూర్తి మంచివాడు కాడు ఎవడూ పూర్తి చెడ్డవాడు కాడు ఎందుకనీ పూర్తి
మంచివాడిదగ్గరికే చెడు సంకల్పం కూడా వెళ్తూంటుంది అన్నీ మంచి చేద్దామని ఎవడు
అనుకుంటాడో వాడిదగ్గరికి చెడు సంకల్పంకూడా వెళ్తుంది.

|
కానీ ధార్మిక ప్రవచనం ధర్మనిష్టనుగురించిన చదువు కేవలం
చదువుకోవడానికే కేవలం వినడానికే అనుకోండి ఏమీ ఉపయోగముండదు, రామాయణం
చదువుకుంటున్నానండీ ఎందుకు చదువుతున్నాను అంటే ఇక్కడ ఇలా పట్టుకునీ చదవడం మనసు
ధర్మం కాబట్టి చదివేస్తుంది నేను ఇవ్వాళ ఈ పన్లుచెయ్యాలి ఈ పన్లుచెయ్యాలి అనుకుంటూ
గబగబా పేజీలు తిప్పేసి అయిపోయాయి 120 పేజీలు అనిచెప్పేసేసి పైపైన కొంత చూసేసీ
అయిపోయిందనిచెప్పేసి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం ! న్యాయేన మార్గేణ మహీం
మహీశాః !! నీరాజనం ఇచ్చి వెళ్లిపోయారనుకోండి రాముడు నాచొక్కాపట్టుకుని అన్నన్నా
నీవు సరిగ్గా చదవలేదు అని నన్నేం అనరు, కానీ... ఎందుకదీ ఎవరికోసం చేస్తున్నట్లు,
ఒక్క శ్లోకం చదువుకో అలాంటప్పుడు, ఒకే ఒక్క శ్లోకం చదువుచాలు భగవద్గీతా
కించిదధీత గంగా జలలవ కణికాపీతా ! నకృదపి యేన మురారి సమర్చా క్రియతే తస్య యమేవ న
చర్చ !! నీకు పనుంది పూనికతో ఒక్కగంటే పూజచేయి నీకు పనుంది పూనికతో అరగంటే
చేయి నీవు చెయ్యగలనూ అని అన్నివిధాలా అనుకున్నావు మనసార రెండుగంటలుచేయి ఏది చేసినా
మనసారాచెయ్ తప్పా రాక్షస స్పర్షను విడిపించుకునే ప్రయత్నంచెయ్యాలి బయట ఉత్తిష్టంతు భూత పిశాచః
ఎంత అవసరమో ఇక్కడ ఉత్తిష్టంతు భూత పిశాచః కూడా అంతే అవసరము.

|
ఇది ఈ ధోరణి ఎకడ్నుంచివచ్చేస్తుందంటే రావణుడు తయారుకాడు ఎలా
తయారౌతాడంటే మీరు మార్గాలు మూస్తే రావణుడు తయారౌతాడు, మీరు మార్గాల్ని జాగ్రత్తగా తెలుసుకునీ అమ్మో నాలో
రావణుడు పెరుగుతున్నాడూ అన్నభావన మీరు పొందారనుకోండి అంతే రావణుడు లోపల ఉండే
అవకాశం ఉండదు రాముడే కూర్చుంటాడు అక్కడ. కాబట్టి ఇది మీరు గమనించవలసి
ఉంటుంది శ్రీరామాయణంలో ఈ ధర్మ సూక్ష్మంలేకుండా నేను కేవలం రావణుని గురించి
చెప్పడంలో అది అంత ప్రయోజనకరమూ అని నేను అనుకోవడంలేదు అందుకని నేను మధ్య మధ్యలో ఈ
విషయాన్ని మనవి చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ శుక సారుణులు
ఇద్దర్నీ కూడా కోపగించి పంపించేశాడు, శార్దూలుడూ అనబడేటటువంటి ఒక గూఢచారిని
తీసుకొచ్చారు అక్కడున్న అమాత్యులు వాళ్ళని పిలిచి నీవు కొంతమంది గూఢచారులతో కలసి వానర
బలంలో ప్రవేశించి వాళ్ళ బలమెటువంటిదో వాళ్ళు ఎంతగొప్ప స్థితిలో ఉన్నారో వాళ్ళు ఏ
వ్యూహ్యంతో ఉన్నారో నీవు కనిపెట్టిరా అంటాడు. మళ్ళీ తిరిగొచ్చి వాళ్ళు రామ బలం
చాలా గొప్పదన్నారనుకోండి మళ్ళి వెంటనే ఏం చెప్తాడో తెలుసాండీ నేను దేవేంద్రున్ని
గెలిచాను నేను యమున్ని గెలిచాను నేను యక్షుల్ని గెలిచాను నేను గంధర్వుల్ని
గెలిచాను ఈ నరుడు నాకొక లెక్కా... ఈ వానరములు ఒకలెక్కా అంటాడు. మరి అటువంటప్పుడు
కనుక్కురమ్మని ఎందుకన్నావు అని అనకూడదు ఎదురుగుండా ఉన్నవాళ్ళు ఎందుకంటే అలా
అనేసాహసం చేయరు, ఎందుకంటే కామం
పక్కన క్రోధం ఉంటుంది, చంపేయండి వీళ్ళని అంటాడు యుక్తా యుక్త విచక్షణ ఉండదు ఇది
రావణుని శీలంలో ఉన్నటువంటి చాలా ప్రమాదకరమైన ధోరణి. ఈ ధోరణికానీ మనం అనుమతించామో
లోపలికి మనలో కూడా రావణుడు చేరిపోతాడు అందుకే చాలా జాగ్రత్తగా మనల్ని మనం
పరిశీలించుకోవడం అలవాటౌతుండాలి.

|
వెంటనే అంటాడు ʻనేను వదలను సీతనుʼ అంటాడు ఇదీ రావణ ప్రవృత్తీ కాబట్టి అన్నిమార్లు పంపిస్తాడు, ఇప్పుడు
శార్దూలుడు వచ్చి ఏం చెప్తాడు పాలనే చెప్తాడు అంతేకదాండి కల్లు అని చెప్పలేడు అలా
ఎవరు చెప్పాలి ప్రహస్తుడు చెప్పాలి. ఇంకేవరూ చెప్పరు అందుకేగా చెప్పాడు విభీషణుడు
వాడికి తెలుసు కానీ చెప్పడు ఎందుకు చెప్పడో తెలుసా నీవలన ప్రాపకంకావాలి వానికి
అందుకని నీకేదిష్టమో అది చెప్తాడు తప్పా నీకు ప్రమాదకరమైన సత్యమును ప్రహస్తుడు
చెప్పడూ అందుకే మాట్లాడితే రావణుడు ఎవరిపేరెత్తుతాడో తెలుసాండీ ప్రహస్తుడి పేరు
ఎత్తుతాడు మీరు చూడండీ లోకంలో ఒక లక్షణముంటుంది నేను చెప్పినమాట ఎప్పుడూ వింటారూ
అన్న ఆలోచన నాకుందనుకోండి ప్రీతి జనిస్తూంది అక్కడ నేను చెప్పిందేదో చేస్తాడాయనాని
కాబట్టి నేను ఎవరివైపు మొగ్గుతానో తెలుసాండీ ఆయన్నికూడా రమ్మనండీ ఆయన్నికూడా
రమ్మనండీ అంటాను. నేను ఎడ్డెం అంటే ఆయన తెడ్డం అంటాడనుకోండి ప్రతిదానికి బాబూ
ఆయనకి ఏదైనా పనుంటే చూసుకొమ్మనండీ అంటారు కదాండి. ప్రహస్తుడూ ప్రహస్తుడూ అని
ఎందుకంటాడో తెలుసా... ఓరేయ్ అది కల్లేమో అన్నాడనుకోండి ఆవుపాలైనా కల్లని ప్రభువు
చెప్పాలనుకుంటున్నాడని గ్రహిస్తాడు ʻప్రభూ! అది కల్లుʼ అంటాడు వీడు ఓ ఆభరణములిస్తాడు అందుకని ప్రహస్తుడంటే ఇష్టం. అందుకే యథాలాపంగా
అవసరమున్నాలేకపోయినా ఎవరిపేరు వస్తూంటుందో తెలుసాండీ ప్రహస్తుడిపేరు వస్తూంది అంటే
వీన్ని చంపేవాడు వాడేని గుర్తు. వీన్ని అధర్మంలో బాగా నిలబెడుతున్నాడన్నమాటవాడు
కాబట్టి వాడివల్ల వీడు చచ్చిపోతాడని గుర్తు. ఇంద్రజిత్తుకానీ ప్రహస్తుడుకానీ అకంపనుడుకానీ
వీళ్ళు ఎవరు మాట్లాడినా ఎన్నాళ్ళు మాట్లాడినా ఇవే మాట్లడుతారుతప్పా తప్పూ అని
మాట్లాడేవాడు ఎవడూ ఉండడు. ఒకవేళ ఎవరైనా మాట్లాడినా వీడువినడు, ఓ మాట చెప్పి ఏం
చేస్తారంటే తలవంచుకుని వెళ్ళిపోతారు తలవంచుకువెళ్ళిపోయేవాళ్ళేకానీ
వీనితలవంచగలిగినవాడు ఉండడు ఎందుకుండడో తెలుసాండీ వీడి తపోబలము, కాబట్టి వీడు వంచడు
వాళ్ళు వంచలేరు కాబట్టి వాళ్ళు వంచలేని తలా వీడు వంచని తలా ఉండడానికి
వీల్లేదుకాబట్టి తరిగేస్తాడు రామ చంద్ర మూర్తి ఇంతే రామాయణం ఇది మీరు
పట్టుకోగలిగితే మనం ఎలా ఉండాలో మనకు తెలిసిపోతూంది.

|
ఆలోచనా అన్నది ఏమిటో తెలుసాండి పాదులాంటిది మీరు విషపు పాదు
తీసుకొచ్చి పెట్టారనుకోండి అదెక్కుతుంది పందిరి, మీరు సన్నజాజి పందిరి
పెట్టారనుకోండి అదెక్కుతుంది పందిరి. మీరు అరణ్యంలో ఎప్పుడైనా చూశారోలేదో
మూకాంభికా క్షేత్రం నుంచి శృంగేరీ వచ్చేటప్పుడు ప్రత్యేకించి ఆ భోగస్తానం గోవా
దగ్గర్నుంచి గోకర్ణ వచ్చేటప్పుడు మీరు రోడ్డుపక్కలో చూస్తే మహా వృక్షాలు ఎన్ని
తీగలు లతలు అల్లుకుపోయి ఉంటాయో అసలు చెట్లు కనపడవు అంతగా అల్లుకుని ఉంటాయి
అల్లుకోవడం దాని లక్షణం మీరు విషభీజం పెడితే విషంతో అల్లుకుంటుంది మంచి బీజం
పెడితే ఆ బీజం పెరుగుతుంది మీరు మంచి ఆలోచనని ప్రోధిచేస్తే అటువైపుకు
అల్లుకుంటుంది. మీరు చెడు ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వడం ఎక్కువైతే అటల్లుకుంటుంది.
అది పందిరి మీరు ఏదిస్తే అటువైపు అల్లుకుంటుంది. దానికున్న లక్షణమది మనసుకి.
ప్రయత్నపూర్వకంగా మీరు తిప్పేస్తూండాలి దాన్ని కుదరదు రా అని మళ్ళి ఇటు తిప్పి ఈ
పందిరేసింది నీవ్వెక్కడానికి కాదు జాజిపూవ్వుతీగ ఎక్కడానికి రాముడికోసం వేసిన పందిరికానీ ఈ
పనికిమాలివాటికోసంకాదు ఈ పందిరి లే ఇక్కడ్నుంచి అని మళ్ళీ మీరు రామున్ని తీసుకొచ్చేస్తుండాలి
అక్కడకి దానికి మనసు ఆమోదించడానికి సిద్ధపడేటట్టుగా మీరు అభ్యాసం చేయించాలి దానిచేత
దానివల్ల కదాండి అభ్యున్నతి కలుగుతుంది. కాబట్టి ఇప్పుడాయన ఆ ఆలోచనచేసి ఒక
ప్రణాళికా నిర్మాణం చేసుకున్నాడు చేసుకుని వెంటనే విద్యుజ్జిహ్వుడు అనబడేటటువంటి
ఒక రాక్షసున్ని పిలిచాడు పిలిచి శిరో మాయామయం గృహ్య రాఘవస్య నిశాచర ! త్వం మాం
సముపతిష్ఠస్వ మహ చ్చ సశరం ధనుః !! రామ చంద్ర మూర్తి యొక్క శిరస్సు ఎలా ఉంటుందో
అటువంటి శిరస్సు ఇక చూస్తే ఎవ్వరూ గుర్తుపట్టకూడదు రాముడి శిరస్సే అనుకోవాలి
అటువంటి శిరస్సు ఒకదాన్ని సృష్టించు రాముడి చేతిలో ధనస్సు బాణము ఎలా ఉంటాయో
అటువంటి ధనస్సు బాణములను సృష్టిచేయి సృష్టిచేసి నేను వెడుతున్నప్పుడు మీరు
పిలిచినప్పుడు రావడానికి వీలుగా ఆశోక వనానికి బయట నిలబడి ఉండండి అని చెప్పాడు చెప్పీ
తాను అశోకవనానికి బయలుదేరాడు.

ఛన్నం తే సర్వతో మూలం
దర్ప స్తే నిహతో మయా ! వ్యసనే నాఽఽత్మనః సీతే మమ భార్యా భవిష్యసి !!
విసృ జేమాం మతిం మూఢే
కిం మృతేన కరిష్యసి ! భవస్వ భద్రే భార్యాణాం సర్వాసా మీశ్వరీ మమ !!
అల్ప పుణ్యే నివృత్తాఽర్థే మూఢే పణ్డిత మానిని ! శృణు భర్తృ
వధం సీతే ఘోరం వృత్ర వధం యథా !!
|
నీవు మూర్ఖురాలివై పండితురాలివనుకుంటున్నావు లేనిపోని
పాపాలు మూటకట్టుకోవడం అంటే ఇదే నా భర్తా నా భర్తా అని ఇన్నాళ్ళు అతిశయంతో
మాట్లాడావే ఆ నీ భర్త మరణించాడు, యుద్ధంలో సంహరింపబడ్డాడు ఆ భర్తయైనటువంటి రాముడు
మరణించాడు గనుకా ఇప్పుడు నీవు నా పాన్పు చేరవలసి ఉంటుంది. పాన్సుచేరితే నా
రాణులందరిమీదా నీవు ఆధిపత్యాన్ని పొందచ్చు నీవు మహారాణివౌతావు, ఇంత చెప్పినా నీకు
అర్థం కాకపోతే నీవు బోగాన్ని అనుభవించడానికి సిద్ధపడకపోతే నీయంత మూఢురాలు లోకంలో
ఉండదు నీవు చాలా అల్పమైనటువంటి పుణ్యంచేసినదానివీ అని నాకు అర్థమౌతూంది. అందుకే
ఇంతగొప్ప అవకాశం వచ్చీ కూడా పొందట్లేదు అనీ ఎలా రామున్ని చంపామో చెప్తాను విను అనీ
అథ సుప్తస్య రామస్య ప్రహస్తేన ప్రమాథినా ! ఇదే నేను మనవి చేసింది ఎవరిపేరు
గుర్తుకొస్తుంటుందో చూడండి అసక్తం కృత హస్తేన శిర శ్చిన్నం మహాఽసినా !!
ఉత్తరతీరాన్ని చేరినటువంటి రాముడు కొన్ని కోట్ల వానరములతో వచ్చి యుద్ధం చేద్దామని
బడలిపోయి రాత్రి శిభిరంలో నిద్రపోతున్నాడు మా వాళ్ళందరూ కామరూపాలున్నవాళ్ళు ఇక్కడ
ఉన్న రాక్షస సైన్యమంతా నిశ్శబ్దంగా నిద్రలో ఉన్నటువంటి వానర సైన్యంలోకి
ప్రవేశించింది ఎవరు ఎవరున్నారు ఎక్కడున్నారు అన్నది వెతికి చూసింది, ఒక గుడారంలో
రామ లక్ష్మణులు నిద్రపోతున్నారు నిద్రపోతున్నటువంటి రాముని యొక్క కంఠాన్ని
ప్రహస్తుడు తన పెద్ద కత్తితో కోసేశాడు కోసేస్తే ఇదిగో ఈ కంఠం.

|
ఒక అబలా ఒక మహా పతీవ్రతా అసలే ఆవిడ భయపడిపోయి ఉన్నది
అకస్మాత్తుగా రామ చంద్ర మూర్తి యొక్క శిరస్సే అన్నట్లుగా కనపడేటటువంటి శిరస్సుచూసి
ఆవిడ వెంటనే నేలమీద పడింది, రావణాసురుడు రావణ శ్చాఽపి చిక్షేప భాస్వరం కార్ముకం
మహత్ ! త్రిషు లోకేషు విఖ్యాతం సీతామ్ ఇదమ్ ఉవాచ హ !! చూశావా..! మూడు లోకములలో
చాలా గొప్పదిగా చెప్పబడినటువంటి ఈ ధనస్సు రత్నములు పొదగబడినటువంటి రాముని యొక్క
ధనస్సు బాణములు ఇదిగో చూడు ఇవి కూడా పట్టుకొచ్చారు అనీ మాయచేత సృష్టింపబడిన
ధనస్సుని బాణాల్నీ సీతమ్మదగ్గరికి విసిరేశాడు ఆవిడ నేలబడి ఏడ్చినటువంటి సర్గా నేను
చెప్పలేను దాన్ని చెప్పక్కరలేదు కూడా ఎవ్వరైనా అర్థం చేసుకోగలరు, మహాపతివ్రత
అటువంటి సీతమ్మగురించి మహర్షి అన్నారూ ఏవ
ముక్త్వా తు వైదేహీ వేపమానా తపస్వినీ ! జగామ జగతీం బాలా చిన్నా తు కదళీ యథా !!
పెద్దగా పెరిగినటువంటి అరటిచెట్టూ పెద్ద గాలేస్తే కిందపడిపోతే ఎలా ఉంటుందో అలా
కిందపడిపోయినటువంటి అరటి చెట్టులా ఆమె నేలమీదపడి గుండెలు బాధపడేలా రామ చంద్ర
మూర్తి యొక్క శిరస్సు పట్టుకుని ఆక్రంధన చేసి ఏడుస్తూంది పరమ సంతోషంగా అక్కడ
నిలబడి ఉన్నాడు అదీ రాక్షసత్వమంటే. ఆయనకి కావలసిందేమిటంటే ఏడ్చి ఏడ్చి ఏడ్చీ
రాముడు లేడుగనుకా తానుకోరినట్లు సంకల్పిస్తుందేమోనని అంటే అంతటి అధర్మమైనటువంటి
కాముక ప్రవృత్తి ఉన్నవాడు.

సమాఽఽశ్వసిహి వైదేహి మా
భూ త్తే మనసో వ్యథా ! ఉక్తా య ద్రావణేన త్వం ప్రత్యుక్తం చ స్వయం త్వయా !!
సఖీ స్నేహేన త ద్భీరు
మయా సర్వం ప్రతిశ్రుతమ్ !!!
లీనయా గగనే శూన్యే భయమ్
ఉత్సృజ్య రావణాత్ ! తవ హేతో ర్విశాలాఽక్షి న హి మే జీవితం ప్రియమ్ !!
న శక్యం సౌప్తికం కర్తుం రామస్య విదితాత్మనః !వధ శ్చ పురుష వ్యాఘ్రే
తస్మిన్నై వోపపద్యతే !!
|
ఆవిడందీ... రావణాసురుడు నీతో వచ్చి మాట్లాడుతున్నప్పుడు
నేను చాటుగా ఉండి అంతా విన్నాను నాకు నీయందు అపారమైనటువంటి స్నేహభావముంది కాబట్టి
ఓ సఖీ! నేను నీతో నిజం చెప్తున్నాను చెప్తున్నటువంటి మాట నమ్ము. వీడి తరమే
రావణాసురుడు ʻనిద్రపోతున్నటువంటి రామ
చంద్ర మూర్తి యొక్క కంఠాన్ని
కోయించగలడా ప్రహస్తునితోʼ దీర్ఘబాహువు విశాలాక్షుడు అపారమైనటువంటి పరాక్రమ సంపన్నుడు
ముప్పై మూడు కోట్ల మంది దేవతల్ని నిగ్రహించగలిగినవాడు అవతలివైపు సైన్యంలో
ఉన్నవీరులు ఆ గుడారంలోకి వెళ్ళి కంఠం కోయడానికి వీలైనరీతిలో అందరూ నిద్రపోతూ
రాముడు నిద్రపోతాడా..! అలా నిద్రపోతూంటే ప్రహస్తుడెళ్ళి ఆయన కంఠం కోసేశాడా? ఇవన్నీ
నమ్మవలసిన మాటలే? నీవు ఎలా నమ్మేశావు? దుఃఖ భారంతో నీవు నమ్మవలసిన మాటలుకావు ఇది
ఒక్కనాటికి జరిగినవిషయంకాదు. మాయచేత సృష్టించాడు శిరస్సుని అందుకే ఆయన వెళ్ళగానే ఆ
శిరస్సు అంతర్ధానమైంది కాబట్టి సీతా నీవు నమ్మకు. రావణుని యొక్క బుద్ధి ఎటువంటిదో
తెలుసా అయుక్త బుద్ధి కృత్యేన సర్వ భూత విరోధినా ! ఇయం ప్రయుక్తా రౌద్రేణ మయా
మాయావిదా త్వయి !! శోక స్తే విగత స్సర్వః కల్యాణం త్వామ్ ఉపస్థితమ్ ! ధ్రువం త్వాం
భజతే లక్ష్మీః ప్రియం ప్రీతికరం శృణు !! నేను చెప్పింది విను రావణాసురుడు
సర్వభూతములతోటీ విరోధం తెచ్చుకున్నవాడే ఎందుకో తెలుసా ఆయన బుద్ధి ఎప్పుడూ తను
కోరుకున్నది అనుభవించాలని ఉంటుంది తప్పా ఇతరుల యొక్క శోకముగురించి ఇతరుల యొక్క బాధ
గురించి అతను ఆలోచించడు కాబట్టే ఇన్ని రకాల మాయలు పన్నీ తను ఏది కోరుకున్నాడో అది
జరిగిపోవాలని తొందరపడుతున్నాడు.

కాబట్టి సరమ అంటూంది సమాగతా త్వం
రామేణ మోదిష్యఽసి మహాత్మనా ! సువర్షేణ సమా యుక్తా యథా సస్యేన మేదినీ !! పంటలతో
కూడినటువంటి భూమి ఎంత అందంగా ఉంటుందో అలా రామునితో కలిసి నీవు అంత సంతోషంగా
ఉండేటటువంటి రోజులు ముందున్నాయి నీవు ఈలోగా ఆ కార్యము సిద్ధింపబడేలోపల గిరివర మఽభితోఽనవర్తమానో
హయ ఇవ మణ్డలమాఽఽశు యః కరోతి త మిహ శరణ మఽభ్యుపేహి దేవి దివస కరం ప్రభవో హ్యఽయం
ప్రజానామ్ !! నీవు మహానుభావుడు ఏ ఈశ్వరుడు మేరుపర్వత శిఖరాలకి ప్రదక్షిణంగా
గుఱ్ఱాలు పూంచిన రథం మీద తిరుగుతుంటాడో ఏ మహానుభావుడు ఈ మాంసనేత్రముచేతా
దర్శింపబడుతాడో అటువంటి సూర్యనారాయణమూర్తికి ఉపాసనచెయ్యీ ఆయన అనుగ్రహం కలిగితే
నీకు సమస్తమైనటువంటి శాంతి నీకు ఈశ్వరుడి యొక్క రక్షణా కలుగుతాయి కాబట్టి నీవు
ఆపని చెయ్యవలసింది అని చెప్పింది. సరేనంది ఆ తల్లి సూర్యోపాసన ప్రారంభం చేసిందీ
అని మనం అనుకోవలసి ఉంటుంది ఆమె సూర్యనారాయణ మూర్తిని ఉపాసన చేస్తూంది. అటువంటి
సమయంలో ʻకైకసిʼ రావణాసురుని యొక్క తల్లి అవిద్ధుడు అని చాలా
వృద్ధుడైనటువంటి ఒక మంత్రి మాల్యవంతుడూ అని కైకసి యొక్క సోదరుడు అంటే రావణాసురుని
యొక్క మేనమామ, మేనమామ గౌరవింపబడవలసినటువంటివాడు ఇటువంటివాళ్ళందరూకూడా
రావణాసురునిదగ్గరికి వెళ్ళారు వెళ్ళి ఆయనకు ధర్మబోధ చేశారు, ఈ యుద్ధానికంతటికీ
కారణం నీవు కేవలం సీతమ్మ తల్లిని తీసుకురావడమే.
|
కాబట్టి నీవు ఈ పనిచెయ్యవద్దూ ఉపద్రవాలు కనపడుతున్నాయి
దుర్నిమిత్తాలు కనపడుతున్నాయి లంకాపట్టణమంతా నశించిపోయే పరిస్థితి కనపడుతూంది
కాబట్టి నీవు సీతమ్మని అప్పజెప్పై ఎవరుచెప్పినా ఏం చెప్తారండీ ఇదే చెప్తారు
చెప్పేవాళ్ళు మారుతారు, ఒకరికన్నా ఒకరు చెప్తే వింటాడేమో అనుకొని విభీషణుడు చెప్తే
వినలేదూ మాల్యవంతుడు వచ్చాడు అవిద్దుడు వచ్చాడు కైకసివచ్చింది అంటే తల్లి మేనమామ
సోదరుడు మంత్రులు అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు చెప్పేవాళ్ళ జాబితా
తరిగిపోతూంది ఆయన మౌఢ్యం పెరిగిపోతూంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళుచెప్పారు చెప్పినా
ఆయన వినలేదు సరికదా కోపగించాడు మాల్యవంతుడిమీద కోపగించి ఒక మాట అన్నాడు ద్విదా
భజ్యేయ మఽప్యేవం న నమేయం తు కస్య చిత్ ! ఏష మే సహజో దోషః స్వభావో దుఽరతిక్రమః !!
ఇదో చిత్రమైనటువంటి లక్షణం రావణాసురునియందు మీరు చూడండీ అలా ఉండకూడదు అని మీరు
అన్నారనుకోండి తప్పు అలా ఉండద్దు అన్నారనుకోండి నేనేం చేయను నా అలవాటు అంటాడు.
అలవాటేంటి మార్చుకోమనే చెప్తున్నది బుద్ధి ఈశ్వరుడెందుకిచ్చాడంటే నీకు ఏ దుర్గుణముందో దాన్ని నీవు
మార్చుకోవడానికే బుద్ధినిచ్చాడు. అది మార్చుకొమ్మనే నేను చెప్తున్నాను అని
నేను అన్నాననుకోండి నేను అదే మార్చుకోలేనని చెప్తున్నాను అంటాడు, మీరు చూడండి మీరు
ఎంత ప్రయత్నంచేయండి ఒక్కొక్కరు తెల్లవారుఝామున లేచేటట్టు మీరు చేయలేరు ఎంత
ప్రయత్నంచేయండి వాడులేవడు రాత్రి అంతసేపు తెలివిగా ఉండవద్దూ అని చెప్పండీ మీరు
ఉంచలేరు.

|
అదీ మొదట్లో విముఖంగా ఉంటుందికానీ తరువాత తరువాత అది ఏం
చేస్తుందంటే అలవాటు పడిపోతుంది మీరు ఎటుతిరిగి ఏమిటంటే తగినంతకారణం లేకుండా దాన్ని
ఎగ్గొట్టేసే ప్రయత్నం మీరు చేయకూడదు. ఏదో ఒక కారణాన్ని మీరు చూపించి దాన్ని
మానేయడానికి అనుమతించడం అవకాశమిచ్చారనుకోండి మానేస్తుంది, ఏముందు కారణం మానేయడానికి ఏమైనా ఉందా బలమైనకారణం
లేదు బలమైనకారణం అయితే నీవు చేయవలసిందేమిటి అని మీరు అన్నారనుకోండి అది నీమాట
వింటూంది. కాబట్టి శరీరాన్ని తీసుకెళ్ళడంతో మొదలుపెట్టీ మెల్లిగా మనసుని
స్వాధీనం చేసుకోమని చెప్తూంది శాస్త్రం మనకి గీతాచార్యుడు అదే చెప్తాడు. ఈయ్యన
అంటాడూ ద్విధా భజ్యేయ మఽప్యేవం న నమేయం తు కస్య చిత్ నా శరీరం రెండు
ముక్కలైపోనీ నా శిరస్సు నా తలనుంచి వేరైపోని ఏష మే సహజో దోషః ఈ శరీరంలో ఒక
గుణముంది స్వభావో దుఽరతిక్రమః నా స్వభావాన్ని నేను అతిక్రమించలేను ఏమిటో
తెలుసా... ఈ పుర్రెలో ఏది
పుట్టిందో అదే చేస్తుంది ఈ కిందది. ఈ కిందదుంది చూశారూ... ఇదీ (శరీరం) ఈ
పైనున్నది ఏం చెప్పిందో అదే చేస్తుంది. చేతులు మంచివే ఎవరిచేతులూ చెడ్డవికావు
అయ్యా మీచేత్తో కొంచెం ఓ పండిద్దురూ ఓ కాయిద్దురూ అంటారు, ఏం ఆయనచేత్తో పండిస్తే
కాయిస్తే గోప్పదెందుకయ్యింది?, ఆయన చెయ్యి ఈశ్వరున్ని ఆరాధించింది నీచెయ్యెందుకు
ఆరాధించట్లా? మీ మనసు చెప్పిన మాటని మీ మనసు ఆరాధించమని మీచేతికి చెప్పలేకపోతూంది.

|
ఈమాట మీకు ఎక్కడైనా వినపడిందనుకోకండి ఎవరొచ్చిచెప్పినా నేనన్నదే చేస్తాను తప్పా... నేను
ఇంకోడు చెప్పిందివిననూ అన్నారనుకోండి ప్రమాదపుటంచులలో నిలబడ్డాడూ అనిగుర్తు.
కాబట్టి ఆ మాట నోటివెంటరాకూడదు యది దావత్ సముద్రే తు సేతు ర్బద్ధో యదృచ్ఛయా !
రామేణ విస్మయః కోఽత్ర యేన తే భయమాఽఽగతమ్ !! ఏమిటీ మీ అందరూ వచ్చి
రాముడొచ్చేశాడూ వానరులొచ్చేశారూ సేతువుకట్టేశాడూ సేతువుదాటేశారు అంటారేమిటీ? ఏం
సేతువు కట్టేయడం పెద్దకష్టమా..? సముద్రమేమిటీ ఓ పిల్లకాలువ? ఓ పిల్లకాలువలో
తీసుకొచ్చి ఇంత మట్టిపోసేస్తే సేతువౌతుంది, సేతువు కట్టేశాడూ చేతువుకట్టేశాడూ
సముద్రమేమైనా అంతగొప్పదా? అన్నాడు ఇంకెవరు చెప్తారండీ..! ప్రారంభంలో ఏమన్నాడు
సముద్రానికి సేతువుకట్టాడంటే మాటలుకాదు, ఇప్పుడేమంటున్నాడు అది పిల్లకాలువా దానికి
సేతువుకడితే ఆశ్చర్యమేమి మీకు దానికంత భయమేమిటీ నేను ఇంద్రున్ని జయించాను నేను
యక్షున్ని జయించాను కిన్నెరుల్ని జయించాను కింపురుషుల్ని జయించాను రాముడు మానవుడు
నాకు పెద్దలెక్కా... నేను చంపేస్తాను అన్నాడు. యుద్ధకాండని యుద్ధకాండగా వినడం
ఒకెత్తు యుద్ధకాండలోంచి మనలో మార్చుకోవలసిన విషయాలన్ని వినడం ఒకెత్తు.
కాబట్టి ఇప్పుడు మాల్యవంతుడు
అన్నాడూ ఆశీర్వచనంచేశాడు అంటే పెద్దలైనవారు ఏం చేయగలరు బాగుండాలని మీరు
కోరుకుంటున్నారు ఆయనేమో బాగుండడానికి సిద్ధంగాలేడూ కాబట్టి మీరు కోప్పడి శాపవాక్కు
విడిచిపెట్టేశారనుకోండి ఇంకాతొందరగా పాడైపోతాడు. మీరు ఎందుకొచ్చారు బాగుచేయడానికి వచ్చారు ఇప్పుడు బాగుపడే
దృష్టి వీడికి కలుగుగాకా... అని ఓ ప్రార్థనచేసి వెళ్ళాలిగా అప్పుడు మీ పెద్దరికం
నిలబడిందని గుర్తు, మీరూ కోపానికే వశులైపోయారనుకోండి అప్పుడు మీ పెద్దరికమేమైనట్టు
అది కాలిపోయినట్లే గుర్తు కదా..! అలా ఉండకూడదు కదా కాబట్టి మాల్యవంతుడు
అన్నాడూ జయాఽఽశిషా చ రాజానం వర్ధయిత్వా యథో చితమ్ ! మాల్యవాన్ అభ్యఽనుజ్ఞాతో
జగామ స్వం నివేశనమ్ !! నాయనా నీకు జయముకలుగుగాకా... అని ఆశ్వీరదించి నేను
బయలుదేరనా అని అడిగి ఆ భవనాన్ని విడిచిపెట్టి తన ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే
ఆయనేమైనా బాధపడుతాడా... విన్లేదని
ఆయన బాధపడ్డాడనుకోండి ఆయనకూడా జారిపోయినట్లే... తన కర్తవ్యం తాను
నిర్వహించాడు. నేను చెయ్యవలసిన విషయం నేనుచేశాను నేను చెప్పగలిగింది చెప్పాను
వినకపోతే వాడికర్మ నేనేం చేస్తాను నేను దగ్గరుండి చేయిస్తానా “వన్స్ ఏ టేక్ ఏ హాస్ట్
బట్ యుకాంట్ మేకిట్ ఇట్ డ్రింక్” మీరు గుఱ్ఱాన్ని నీటిదగ్గరకు తీసుకెళ్ళగలరేమో
నీరు తాగించగలరా తాగించలేరు. అందుకే కదాండీ మహా సత్పురుషులైనవాడు కడుపున
ఒక్కొక్కసారి దుర్మార్గమైనటువంటివాడు పుడుతుంటాడు కారణమేమిటంటే ఎదురుగుండా తండ్రి
ఉంటే తానెలా దుర్మార్గుడుకాగలిగాడు గుణనిధి కథలో అంటే తన మనసుని తాను
నిగ్రహించలేకపోయాడు కాబట్టి పాడైపోతాడు అంతే.
కాబట్టి ఇప్పుడు మాల్యవంతుడు
వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తరువాత రామ చంద్ర మూర్తి సైన్యానంతటినీ తీసుకునీ
ఒక్కసారి ఆ అంతఃపురం లంకాపట్టణం దానివైభవం చూడాలీ అనుకున్నారు, లంకలో ఉన్న
విచిత్రమేమిటంటే దాని దక్షిణతీరంలో దీనిగురించీ విశ్వకర్మ చెప్తారు ఎక్కడ
చెప్తారంటే ఉత్తరకాండలో చెప్పారు ఇక్కడ చెప్పలేదుకాని ఉత్తరకాండలో
|

తస్యాం గోపుర శృంగ స్థం
రాక్షసేంద్రం దురాసదం ! శ్వేత చామర పర్యంతం విజయ చ్ఛత్ర శోభితం !!
రక్త చందన సంలిప్తం
రత్నాఽఽభరణ భూషితం ! నీల జీమూత సంకాశం హేమ సంఛాదితాంఽబరం !!
ఐరావత విషాణాఽగ్రై
రుత్కృష్ట కిణ వక్షసం ! శశ లోహిత రాగేణ సంవీతం రక్త వాససా !!
సంధ్యాఽఽతపేన సంవీతం మేఘ రాశి మివాఽమ్బరే !
వెంటనే అలా చూసే సరికీ తెల్లటి
గొడుగుకిందా అమూల్యమైనటువంటి పట్టుబట్ట కట్టుకునీ నల్లటిమబ్బు కిందకిదికితే ఎలా
ఉంటుందో అలాంటి స్వరూపంతో చిత్రవిచిత్రమైనటువంటి బంగారు ఆభరణములను
ధరించినటువంటివాడై గుండెలమీద ఐరావతం తన యొక్క దంతములతో కుమ్మితే ఏర్పడినటువంటి
గాయములతో కూడినటువంటివాడై చెవుల పిల్లి రక్తము ఎలా ఉంటుందో అటువంటి ఎరుపుతో కూడిన
ఎర్ర చందనాన్ని ఒళ్ళంతా అలదుకున్నవాడై చాలా విలాసంగా ఒక ఆసనంమీద మేడమీద
కూర్చున్నటువంటి రావణాసురుడు కనపడ్డాడు. కనపడగానే ఎవరికి ఎక్కువ కోపంరావాలి రామ
చంద్ర మూర్తికి రావాలి కానీ రాముడు నిగ్రహించుకున్నాడు ఇది జిత క్రోధః ఎక్కడ
అవసరమో అక్కడ బయటపడుతాడు. కానీ సుగ్రీవుడు తప్పూ అని మీరు చెప్పడం చాలా కష్టం
ఎందుకో తెలుసాండి తొందరపడి తప్పని చెప్పేయడం చాలాతేలిక అపారమైనటువంటి ప్రేమ
ఉన్నవాడు తట్టుకోలేకపోయాడు సుగ్రీవుడు వెంటనే ఒక్కధూకు ధూకి ఎగిరి రావణాసురుని
యొక్క అంతఃపురంలోకి వెళ్ళి పడ్డాడు పడి ఆ కూర్చున్నటువంటి రావణుని యొక్క
కిరీటాన్ని పట్టుకుని లాగేశాడు లాగేసి ఒక్కసారి దాన్ని తీసుకుని నేలకేసి కొట్టాడు.
ఆ కిరీటంలేకుండా నిలబడిపోయినటువంటి
రావణుడు వచ్చినవాడు సుగ్రీవుడూ అని గుర్తించాడు లోక నాథస్య రామస్య సఖా దాసోఽస్మి
రాక్షస ! న మయా మోక్ష్యసేఽద్య త్వం పార్థివేంద్రస్య తేజసా !! ఇత్యుక్త్వా
సహసోత్పత్య పుప్లువే తస్య చోపరి ! ఆకృష్య మకుటం చిత్రం పాతయిత్వా అపత ద్భువి !!
సుగ్రీవ స్త్వం పరోక్షం మే హీన గ్రీవో భవిష్యసి ! అంటాడు రావణాసురుడు. ఆ
కిరీటం తీసి నేలకేసి కొట్టి ఒక్కసారి రావణాసురున్ని పట్టుకుని ఒక్క కుదుపు కుదిపి
కిందకితోసేశాడు ఆయన నేలమీద పడిపోయాడు పడిపోయినటువంటి రావణుడి దగ్గరకి వెళ్ళి లోక
నాథస్య రామస్య లోకనాథుడైన రామ చంద్ర మూర్తి యొక్క సఖున్ని నేను నాపేరు సుగ్రీవుడు
నేను నిన్ను నిర్జించడానికి వచ్చానని ఆయనతో కలియబడ్డాడు. రావణుడు అన్నాడు నా కంటపడలేదు
కాబట్టి సుగ్రీవుడివి ఇక నా కంటపడ్డావుకాబట్టి నీవు గ్రీవములేనివాడివౌతావు అంటే
కంఠములేనివాడివౌతావనీ ఇద్దరూకలిబడ్డారు చాలా విశేషమైనటువంటి మల్లయుద్ధంజరుగుతూంది.
ఇద్దరూ యుద్ధం చేస్తున్న సమయంలో రావణాసురుడు అకస్మాత్తుగా తన మాయాబలాన్ని
పైకితీశాడు ఇది చమత్కారంగా ఉంటుంది, కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడు గమనించాడు ఓహో
మాయా యుద్ధాన్ని ప్రారంభం చేశాడు. మాయాయుద్ధం ఎప్పుడూ టక్కరితనంగా ఉంటుంది మాయా
యుద్ధం ధర్మ యుద్ధం ముందు నిలబడగలదా అంటే చిట్ట చివరికి నిలబడుతుందనే చెప్పాలి
ఎందుకంటే అలా చెప్పకపోతే ధర్మమన్నమాటకు అర్థముండుదు. కానీ తాత్కాలికంగా మాత్రం
మాయా యుద్ధాన్ని జయించడం అంతతేలికైన విషమేం కాదు. కాబట్టి ఒక్క క్షణంలో మాయా
యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నాడని గ్రహించిన సుగ్రీవుడు రావణాసురుడి అంతఃపురం
నుంచి ఒక్క ధూకు ధూకి మళ్ళీ రామ చంద్ర మూర్తి ఉన్న పర్వతంమీదికి సువేల పర్వత శిఖరం
మీద నిలబడ్డాడు. వెంటనే రాముడన్నాడు సుగ్రీవునితో
|
అథ తస్మిన్ నిమిత్తాని దృష్ట్వా
లక్ష్మణ పూర్వజః ! సుగ్రీవం సంపరిష్వజ్య తదా వచన మబ్రవీత్ !!
అసమ్మంత్ర్య మయా సార్థం
త దిదం సాహస కృతం ! ఏవం సాహస కర్మాణి న కుర్విన్తి జనేశ్వరాః !!
సంశయే స్థాప్య మాం చేదం
బలం చ సవిభీషణం ! కష్టం కృత మిదం వీర సాహసం సాహస ప్రియ !!
ఇదానీం మా కృథా వీర ఏవం
విధ మఽచిన్తితం ! త్వయి కించి త్సమాఽఽపన్నే కిం కార్యం సీతయా మమ !!
భరతేన మహా బాహో
లక్ష్మణేన యవీయసా ! శత్రుఘ్నేన చ శత్రుఘ్న స్వ శరీరేణ వా పునః !!
త్వయి చ అనాగతే పూర్వ
మితి మే నిశ్చితా మతిః ! జానత శ్చాఽపి తే వీర్యం మహేంద్ర వరుణోపమ !!
హత్వాఽహం రావణం యుద్ధే
స పుత్రబల వాహనం ! అభిషిచ్య చ లంకాయాం విభీషణం అథాఽపి చ !!
భరతే రాజ్య మాఽఽవేశ్య త్యక్షే దేహం మహా బల !

|
కాబట్టి సుగ్రీవుడు అన్నాడూ తవ భార్యఽపహర్తారం దృష్ట్వా
రాఘవ రావణం ! మర్షయామి కథం వీర జానన్ పౌరుష మాత్మనః !! ఈ దుర్మార్గుడే నీ
భార్యను అపహరించినవాడన్న భావన నాలోగలుగగానే... ఇదీ! స్నేహప్రియత్నం, ఎంత ప్రేమో
చూడండి ఆ సుగ్రీవునికి, నీ భార్యను అపహరించినటువంటి దుర్మార్గుడువీడే అన్న
ఆలోచనకలిగిన ఉత్తరక్షణంలో ఇక నన్నునేను నిగ్రహించుకోలేకపోయాను అందుకని ఒక్కసారి
అక్కడికివెళ్ళి రావణాసురునితో యుద్ధం చేశానుతప్పా... దీనివలన వచ్చినటువంటి
ఇబ్బందిలేదు కాబట్టి నీవు ఆస్వాసమును మనఃశాంతిని పొందవలసినది అన్నాడు. తరువాత
యుద్ధానికి సిద్దమయ్యారు ఏ ద్వారం దగ్గర ఎవరు నిలబడాలో చెప్పారు, చెపుతూ ప్రధానంగా
మన సైన్యానికి ఉండవలసిన లక్షణ మొక్కటే జరిగేటటువంటి యుద్ధం వానరులకు నరులకు
రాక్షసులకు జరుగుతూంది, రాక్షసులు కామ రూపులు కామ రూపులు రాత్రి యుద్ధం చేస్తారు,
కాబట్టి ఇప్పుడు ఎవరు ఎవరన్నది మనకు తెలియదు వచ్చిన పెద్ద ఇబ్బందేంటంటే మన వేశాలు
వాళ్ళు కడుతారు మీకూ కామ రూపాలు తెలుసు కాబట్టి మీరు కామ రూపాలు పొందితే నేను బాణ
ప్రయోగం చేసేటప్పుడు ఎవడు వానరుడో ఎవడు రాక్షసుడో తెలియదు కాబట్టి ఒక్క వానరుడు
నాచేత నలిగిపోయినా నేను ఈ యుద్ధానికి రావడంవల్ల ప్రయోజనముండదు కాబట్టి మీరు మాత్రం
కామ రూపములను తీసుకొనరాదు వానరులందరూ వానరులుగానే ఉండాలి. ఒక్క ఏడుగురు మాత్రమే
మనుష్యరూపంలో తిరగాలి యుద్ధ భూమిలో, ఒకటి నేను రెండు లక్ష్మణ మూర్తి మూడు
విభీషణుడు నలుగురు విభీషణుని యొక్క సచివులు ఈ ఏడుగురు మాత్రం మనుష్య రూపాలతో
తిరుగుతారు మిగిలిన వాళ్ళందరూ వానర రూపాలతోనే ఉండాలి.
అప్పుడు నాకు బండగుర్తేమిటంటే
ఏడుగురు మనుష్యులు మిగిలినవానరములు నావాళ్ళు కనపడిన రాక్షసులందరూ రాక్షసులే
లేకపోతే అయోమయావస్థ వస్తూంది. మీరు అప్పుడప్పుడు రాక్షసులుగా మారడం మొదలు పెడితే మీరు
ఇప్పుడు ఎలా సాహసం చేశారో అలా కామరూపాలు పొందితే నేనుకూడా తొందరపడి రాక్షసుడే అనుకొని
బాణం వేసేస్తే... నావారిని నేను చంపుకోవడమౌతుంది. ఇదే మనకు కొండగుర్తు ఏడుగురు
మనుష్య రూపంలో ఉంటారు మిగిలినవాళ్ళు వానర రూపంలో ఉంటారు. అంటే మీరొకటి గమనించాలి తనకార్యం నడిచిపోవడం రామునికి
ప్రధానంకాదు తనను నమ్మి వచ్చినవాళ్ళను ఎంత జాగ్రత్తగా రక్షించాలన్నదానిమీది రాముడి
యొక్క లక్ష్యం ఉంటుంది. రావణుడైతే తను కోరుకున్న కోరికతీరితేచాలు దానికోసం
ఎంతమంది నిహతులై పోయినా ఆయనకి పట్టింపు ఉండదు ఇదీ ఇద్దరికీ తేడా... కాబట్టి ఎవర్ని పట్టుకుంటే బ్రతుకుతారు
ఎవర్ని పట్టుకుంటె మడిచిపోతారు రామున్ని పట్టుకున్నవాడు ఎప్పటికీ బ్రతుకుతాడు
రావణున్ని పట్టుకున్నవాడు ఎప్పుడైనా మడిచిపోతాడు ఇది తీర్పు. కాబట్టి
యుద్దానికి వ్యూహాన్నంతట్నీ రచించారు, రచించిన తరువాత వాళ్ళందరూ వెంటనే
చెట్లుపీకేశారు పర్వత శిఖరాలు పీకేశారు శిలలు పట్టుకొచ్చేశారు వాళ్ళందరు ఇంక రామ
చంద్ర మూర్తి ʻఊʼ అనడమే తరువాయి వెళ్ళి ఆ ప్రాకారముల మీద పడిపోవడానికి
సిద్ధంగా ఉన్నారు. అటువంటి సమయంలో రాముడు పరమ ధర్మాత్ముడు ఆయన అన్నాడు ఎప్పుడూ యుద్ధాన్ని యుద్ధంగా
ప్రారంభించకూడదు ఒక్కమంచిమాట మనం చెప్పవలసి ఉంటుంది అప్పుడు కూడా వినకపోతే ఇక
చంపడం వినా మార్గంలేదు ఇదీ ఆయన ధర్మమంటే ఇప్పుడు మీరు రామావతారానికి
ఉన్నటువంటి గొప్పతనాన్ని ఏది గుర్తించవలసి ఉంటుందంటే ఎన్ని తప్పులు చేశాడని రాముడు
చూడడు, మారగలవా? ఇది చూస్తాడు ఈ
క్షణంవరకు నా జీవితంలో నేను ఎన్ని మహాపాపములుచేశాను చూడడానికి సిద్ధంగా రాముడులేడు
“త్రికరణ శుద్ధిగా నీవు రాముని ముందు నేలమీదపడి పాహి రామ ప్రభో అనగలవా?
నీవు అలా అనగలిగితే స్వీకరించడానికి రాముడు సిద్ధంగా ఉన్నాడు” శ్రీరామాయణం ఈ
జాతికి పెట్టిన పెద్ద భిక్ష పెద్ద ఓదార్పువాక్కు ఇది. ఎందుకంటే
తప్పుచెయ్యనివాడు ఎవ్వడూలేడు కానీ ఇక చెయ్యను చేసినది మన్నింపబడుగాకా రామా! నా
తప్పులు నీకు తెలుసు మన్నించు అని పడగలవా..? పడితే రామ చంద్ర మూర్తి నిన్ను
స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. నీవు అలా లేకపోతే... నీవు రావణునితో సమానము
నిన్ను రక్షించగలిగినవారులేరు.
|
అంతే తేడా ఇదీ పట్టుకోగలిగితే రామాయణం యొక్క ప్రయోజనం
సిద్ధిస్తుంది, ఇది పట్టుకోలేకపోతే శ్రీరామాయణం చెప్పినా మారకపోవడం శ్రీరామాయణం
చదివినా మారకపోవడం ఎంతమంది మాటలు విన్నా మారనటువంటి రావణుని యొక్క పూనికలాగే
ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఆయన పిలిచి అన్నారు నేను ఏ సీతమ్మతల్లి కోసం యుద్ధానికి
బయలుదేరి లంకాపట్టణానికి వచ్చానో ఆ లంకాపట్టణాన్ని నశింపజేయకుండా ఉండను సీతమ్మని
తీసుకొచ్చి నాకు సమర్పించాడా... కృతకృత్యుడౌతాడు అలా సమర్పించలేదా... ఈ
లంకాపట్టణాన్ని నశింపజేసి రాక్షస సహితంగా రావణున్ని నిర్మూలిస్తాను అన్నారని
వెళ్ళి చెప్పిరా... అని అంగదున్ని పంపించారు. సభా మంటంలో కూర్చున్నటువంటి రావణుని
యొక్క సభలోకి అంగధుడు ప్రవేశించాడు, ప్రవేశించి దూతోఽహం కోసలేన్ద్రస్య రామస్యాఽక్లిష్టకర్మణః
! వాలి పుత్రోంఽగదో నామ యది తే శ్రోత్ర మాఽఽగతః !! నేను వాలి యొక్క పుత్రున్ని
నన్ను అంగదుడూ అంటారు దూతోఽహం కోసలేన్ద్రస్య నేను కోసలేంద్రుడైనటువంటి రామ
చంద్ర మూర్తి యొక్క ధూతని అక్లిష్టకర్మణః హేలగా ఎటువంటి పనైనా చెయ్యగలిగినటువంటివాడు
మహానుభావుడు మా రామ చంద్ర మూర్తి, నీకు నాలుగు మంచిమాటలు చెప్పమని పంపారు కాబట్టి
చెప్తాను విను
అహ త్వాం రాఘవో రామః
కౌసల్యాఽఽనన్ద వర్ధనః ! నిష్పత్య ప్రతియుధ్యస్వ నృశంసం పురుషో భవ !!
హన్తాఽస్మి త్వాం సహాఽమాత్యం
సపుత్రజ్ఞాతి బాన్దవమ్ ! నిరుద్విగ్నా స్త్రయో లోకా భవిష్యన్తి హతే త్వయి !!
దేవ దానవ యక్షాణాం
గన్ధర్వోరగ రక్షసామ్ ! శత్రు మఽద్యోద్దరిష్యామి త్వామ్ ఋషీణాం చ కణ్టకమ్ !!
విభీషణస్య చైశ్వర్యం
భవిష్యతి హతే త్వయి ! న చేత్ సత్కృత్య వైదేహీం ప్రణిపత్య ప్రదాస్యసి !!
ఇత్యేవం పరుషం వాక్యం బ్రువాణే హరి పుంగవే ! అమర్ష వశ మాఽఽపన్నో
నిశాచర గణేశ్వరః !!
నీ యొక్క బంధు పుత్ర మిత్ర
పరివారంగా లంకాపట్టణంతోసహా నశింపజేయడానికి రామ చంద్ర మూర్తి సైన్యంతో యుద్ధానికి
సిద్ధంగా ఉన్నారు. నీతో ఒక్కమాట చెప్పమని చెప్పారు ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకునీ
సీతమ్మని రామ చంద్ర మూర్తికి అప్పజెప్తే... నిన్ను క్షమించి వెళ్ళిపోవడానికి
రాముడు సిద్దంగా ఉన్నాడు. కాబట్టి సీతమ్మని అప్పజెప్తావో లంకతో సైన్యంతో కుటుంబంతో
నశించిపోతావో తేల్చుకోవలసిన సమయం ఆసన్నమైనది కాబట్టి రావణా! నీకు ఈ మంచిమాటలు
చెప్పడానికి వచ్చాను వాలి పుత్రున్ని అంగదున్ని అని చెప్పారు. వెంటనే రావణుడన్నాడు
ఈ వానరాన్ని పట్టి బంధించి సంహరించండి అన్నాడు. ఇదే రాముడైతే అందుకే మహర్షి
పక్కపక్కనే పక్కపక్కనే చూపిస్తుంటారు, ఇదే రామ చంద్ర మూర్తైతే
|


ఉచ్చువేసి పట్టి కొట్టి చంపి దాని
తోలు తీయడం కష్టమనీ దాన్ని అలానే రెండు స్తంభాలకు కట్టి వేలాడదీసి కిందనుంచి
అగ్నిహోత్రంపెట్టి కాల్చేస్తే ఏ రూపంతో ఉందో ఆ రూపంతోనే ఉడికిపోయాకా అప్పుడు కోసి
మాంసపు ముక్కలు తీసి అమ్ముతారు ఎంత దుర్భరమైన చావు చచ్చిపోతూందో మీరు చూడండీ. అలా
కోట్ల జన్మలెత్తాలి ఎందుకు తెచ్చుకుంటావు ఆ ప్రారబ్దం మిగిలినవాళ్ళు డబ్బిస్తారేమో
మిగిలినవాళ్ళు ఏదో సుఖాన్నిస్తారేమో కానీ నీవు ఇలా చచ్చిపోకుండా చేయగలిగినటువంటి
నీకు పుణ్యాన్ని కట్టబెట్టగలిగినటువంటి వాడు ఒక్కడే ఉన్నాడు సత్పురుషుడు. ఆయన తాను
|
ధర్మమునందు నిలబడీ నిన్ను ధర్మమునందు లాగడానికి
ప్రయత్నిస్తాడు నీ ఆ ఒక్క బంధనంకానీ వదిలేసుకున్నావో చాలా ఇబ్బందుల్లోకి
వెళ్ళిపోతావు అందుకే కష్టంగా ఉన్నా అంటిపెట్టుకుని ఉండి తీరాలి సత్పురుషులతోటి ఆ
ఉండనూ అన్నమాట చాలా ప్రమాదకరం అందుకే శృణ్వన్ తపః విను విను విను బాగా విను
బాగా విను అంటారు ఎందుకో తెలుసాండీ అదీ అనుభవించేటప్పుడు తెలుస్తూంది ఆ బాధేమిటో
చాలా కష్టంగా ఉంటుంది అందుకనీ పొందవద్దూ చాలా ఇబ్బంది పడిపోతావు అటువంటి బాధలు
పడకుండా ఉండాలంటే హాయిగా కనీసంలో కనీసం నీయంత నీవు ఊపిరి వదిలిపెట్టగలిగినటువంటి
ఏకైక జన్మ మనుష్యజన్మ ఈశ్వరుడు ఇన్నివరాలు ఇచ్చినటువంటి జన్మ మనుష్య జన్మ ఆయన ఏమి
మనల్ని అనుభవించద్దన్నాడు ఆయన అన్నీ అనుభవించమనే చెప్పాడు అందుకేగా ఆయన ఇన్ని
భోగాలు సృష్టించాడు. ఆయన బెల్లం ముక్క దేనికి సృష్టించాడు మనల్ని తినమనే
సృష్టించాడు, ఆయన పంచదార ఎందుకు సృష్టించాడు మనల్ని తినమనే సృష్టించాడు ఆయన చెరుకుకర్ర
ఎందుకు సృష్టించాడు మనల్ని తినమనే సృష్టించాడు.

|
ఎంత దొంగతనమండి ఇంకా ఆ ఒక్కమాట అనడానికి సంస్కారం కావాలి ఆ
సంస్కారం ఏర్పడడానికి మీరు ప్రవచనాలు వినాలి, ఆ సంస్కారం ఏర్పడడానికి రామాయణం
చదువుకోవాలి, ఆ సంస్కారం లేకుండా బ్రతికేయడానికి ఇవన్నీ వదిలేసి బ్రతికేయవచ్చు,
కానీ తరువాత వచ్చే జన్మలో పునర్జన్మ సిద్ధాంతం అంగీకరిస్తేగా బొట్టుపెట్టుకొచ్చి
గుళ్ళో కూర్చున్నావ్ మరి మిగిలిన జన్మల్లో ఎలా బ్రతుకుతావ్ మళ్ళీ ఎన్ని కోట్ల
జన్మల తరువాత వినే అదృష్టం నీకు కలుగుతూంది, ఇప్పుడు విననివాడివి అప్పుడు వింటావని
ఏమి నమ్మకం. ఎన్ని కోట్ల కోట్ల జన్మలు అంత కష్టమైన చావు చావవలసి ఉంటుంది
ఎందుకొచ్చిన ప్రారబ్దం ఏది ఈశ్వరుడు నిన్ను ఒద్దన్నాడు ధార్మికంగా అనుభవించూ
అన్నాడు ధార్మికంగా అనుభవించడానికి నీవు సిద్దపడితే నీవు అదృష్టవంతుడవు హాయిగా
అనుభవించవచ్చు. ఏది అనుభవిస్తున్నా వేదం అంగీకరించినరీతిలో చక్కగా అనుభవిస్తూ
ఈశ్వరా ఇది నీ అనుగ్రహం అదొక్కమాట నిజాయితీగా అనగలిగితే... ఇప్పుడూ నాకో విడిది
ఇచ్చారండి ఎక్కడో ఉండమని నేను ఆ విడిదిలో ఉన్నాను అది చాలా బాగుందని ఆఖరిరోజన నేను
వెళ్ళిపోయే ముందు ఎవరికో అద్దెకిచ్చి వెళ్ళిపోయాననుకోండి ఇక మళ్ళీ ఎప్పుడైనా
ఇస్తారా..? నేను అందులో ఉన్నప్పుడు ప్రతిరోజూ నన్ను అడుగుతుంటారు హరిప్రసాదుగారు
అయ్యా బాగుందా మీకేమైనా ఇబ్బందిలేదుగదా అందులో ఇంకేమైనా సౌకర్యంకావాలా అంటారు
ఎందుకంటారు? ఆయనది అది నాకు తాత్కాలికంగా ఇచ్చారు విడిది, ఆయనది అని నేను ఆ
మర్యాదతో దాన్ని అనుభవించినన్నాళ్ళూ సంతోషంగా ఇస్తారు. ఇది బాగుందండీ నాపేర
రాసేస్తారా అన్నారనుకోండి ఇంక వచ్చేసారి ఓ ఆకేస్తారు వచ్చేటప్పుడు ఏమో ఏమంటారో
ఏదిస్తే అదని.
కాబట్టి ఆయనదీ అని అంటే నీవు అంత సంతోషిస్తున్నావే...
నాన్నగారు తీసుకొచ్చారని ఒక్కమాట అనలేకపోయారంటాడు పిల్లల్నీ, మంచిబట్టలు
పట్టుకొస్తాడు వేసుకొనీ దండం పెట్లేదనుకోండి లేకపోతే ఒక నమస్కారం చేయలేదనుకోండి
ఏది నాన్నగారు తెచ్చారు బట్టలు అని ఒక్కమాట అనలేదు చూశావా..! ఇంత కష్టపడి
పిల్లల్ని పెద్దచేశాను నాన్నగారండీ నీవల్ల ఇంత వృద్ధిలోకివచ్చాను అన్లేదువాడని అంత
గింజుకుంటావే భార్యవండిందక్కడ పెడితే అంతా తినేసి చెయ్యికడుక్కుని ఏమండీ ఎలా ఉందీ
అంటూంది. ఊ అన్నారనుకోండి, ఏం బాగుందంటే కొంపపడిపోయిందేంటి నీ పలుకే బంగారమాయనా
అన్నాడు. ప్రతీవాళ్ళు ఏం ఆమాట అన్లేవా..? అంటారు ఇన్ని మీకు ఇచ్చినవాన్ని
స్మరించకపోతే మరి వాడేమనుకోవాలి ఊపిరేం నీవు తీయ్యట్లేదుగా నిద్రపోయినప్పుడు
వాడేగాతీయిస్తున్నాడు భవతి ఉన్నాడు అనడానికి వాడుగా కారణం. ఈశ్వరుడివల్ల
కదా మిగిలినవన్నీ వచ్చాయి మరి వాన్ని స్మరించకపోవడం ఎంత కృతఘ్నత వాన్ని ఒక్కవాన్ని
ముందుకు పెట్టారనుకోండి వాడిచ్చిన వైభోగం అన్నారనుకోండి తప్పుపని చేస్తూ
వాడిచిందని చేయండి చూస్తాను, ఇది తప్పుపనని తెలిసీ వాడిచ్చిందని మీరు చేయగలరా మీరు
చేయలేరు వాడిచ్చిందని చేయాలంటే వాడించ్చిందని చేయవలసిందే మీరు చేయవలసి ఉంటుంది
అంటే అయిపోయింది అంతే జీవితం దిద్దబడిపోయింది అంతే... కాబట్టి సత్పురుష
సహవాసమన్నది ఎన్నడూ విడిచిపెట్టకూడదు. అసలు మంచిమాట వినడానికి ఎవరు సిద్ధంగాలేరో
వాడే పతనమైపోతున్నాడని గుర్తు. వాడికి వినడానికి ఖాలీ ఉండదు వాడు వినడు.
కాబట్టి ఇప్పుడు ఈ అంగదున్నిపట్టి
సంహరించండి అన్నాడు, ఆయన భయపడలేదు ఆయన అలా నిల్చున్నాడు ఎందుకు నిల్చున్నాడో
తెలుసాండీ నన్ను పట్టగలగిన మొనగాడు ఉన్నాడేమిటి ఇక్కడ అని అనుకున్నాడు ఇది ఆయన
నమ్మకం. ఏదో పదిమంది వచ్చారు చంకల్లో చేతులెట్టారు ఆయన్ని పట్టుకున్నారు ఇప్పుడు
ఆయనేం చేశాడు వీళ్ళతో సహా ఆయన ఎగిరిపోయాడు ఎగిరిపోయి ఆ ప్రాకారం మీద దిగితే ఆ
ప్రాకారం బద్ధలైపోయింది ఇది ఆయన బలం, ఆయన బలం వాడికితెలియదు, ఎప్పుడు కోతులు
కోతులు అనుకూంటూంటాడు, ఇప్పుడు ఆ చంకల్లో ఉన్నవాళ్ళన్ని అక్కడ్నుంచి కిందికి
|


|
ఓహో! తోటకాచ్యారులువారంటే వీరికి ఇంత చిన్నచూపు ఉందని
శంకరులు అనుగ్రహించారు. గురువుగారు సంకల్పం చేశారు మహానుభావుడు శంకరభగవత్పాదులంటే
అనుగ్రహించారు అంతే తోటకాచార్యులవారికి ఎక్కడలేని ప్రజ్ఞ భాషించింది ఆయన శంకర
భగవత్పాదులను చూసి అప్పుడు గురువుగారిని చూసి చేసిన స్తోత్రమే తోటకాష్టకం అందుకే
ఆయన పేరుమీదనే వచ్చింది ఈ అష్టకం. ఇది అసలు నీజానికి యదార్థం చెప్పాలంటే
తోటకాష్టకానికి వ్యాఖ్యాచేస్తే ఇందులోకే శంకర విజయాలన్నీ వచ్చేస్తాయి. అంతగొప్ప అష్టకం ఈ అష్టకాన్ని
శంకర భగవత్పాదుల దగ్గర చదివితే గురువుగారి యొక్క అనుగ్రహం కలుగుతుంది గురువుగారి
అనుగ్రహం కలిగితే ఏమౌతుంది ఇహమూ పరమూ రెండూ సిద్ధిస్తాయి. కాబట్టి ఇది చదవాలి కానీ
తోటకాష్టకం చదవడానికి పెద్దలు ఒక నియమం చెప్తారు ఏమిటా నియమం అంటే కూర్చుని
చదవకూడదు తోటకాష్టకం నిలబడి చదవాలి ప్రతిసారీ కూడా మీరు చూడండీ ప్రతి శ్లోకానికి
చివరా భవ శంకరదేశిక మే శరణం అని ఉంటుంది. ఆ భవ శంకరదేశిక మే శరణం అన్న
తరువాత ఒంగి కుడి చేత్తో ఒక్కసారి నేలని ముట్టుకోవాలి, శంకరాచార్యులవారి పాదములు,
పాదములను ముట్టుకుని నమస్కారము చేయకూడదు చెప్పాను కదా... అందుకనీ పాదములను ముట్టుకోవడం కన్నా
పాదములను ముట్టుకోకుండా చేసిన నమస్కారం చాలా ప్రశస్తమైన నమస్కారం. అసలు
ముట్టుకోకూడదు కూడా పీఠాధిపతుల్నీ సన్యసించినవారిని ముట్టుకోరు అంటే దానికి కారణం
వేరే ఉంటుంది అందుకనీ భూమిని ముట్టుకుని నమస్కారం చేస్తాము కాబట్టి మనం ఇవ్వాళ
అందరము లేచినిలబడి ఆ స్తోత్రాన్ని చేద్దాం. కాబట్టి లేచిపోకండీ నేను అన్నానా
లేచిపొమ్మని దానికన్నా ముందు పదకొండుమాట్లు రామ నామం చెప్పాలికదా... రామ నామం
చెప్పి నేను ఉపన్యాసానికి మంగళం చెప్తే కదా నేనూ నిలబడడానికి అవకాశం లభించేది
లేకుండా నేను నిలబడ కూడదు కాబట్టి మంగళం చెప్పి నేను నిలబడుతాను నిలబడిన తరువాత
అప్పుడు తోటకాష్టకం చేద్దాము.
కాబట్టి ముందు మనమొక్కసారి రామ
నామాన్ని చెప్పుకుందాం.
రామ నామము రామ నామము రమ్యమైనది రామ
నామము !!రా!!
ఉపనిషత్ వాఖ్యములచే ఒప్పుచున్నది
రామ నామము !!రా!!
రాక్షసులను తరిమికొట్టిన నామమే శ్రీ
రామ నామము !!రా!!
శాంతిగా ప్రార్థించువారికి సౌఖ్యమైనది
రామ నామము !!రా!!
పరమపదమును చేరుటకుదారి చూపునది ఈ
రామ నామము !!రా!!
తల్లివలె రక్షించుసుజనుల నెల్లకాలము
రామ నామము !!రా!!
జ్ఞానులకు ఆత్మానుభవ జ్ఞానమే శ్రీ
రామ నామము !!రా!!
రావణానుజ హృదయ పంకజ రాచకీరము రామ
నామము !!రా!!
రామ తత్వమునెరుగువారికి ముక్తి తత్వము
రామ నామము !!రా!!
శరణు శరణను విభీషణునునికి శరణమెసగిన
రామ నామము !!రా!!
|
దాసులను రక్షించదయగల ధర్మ నామము రామ నామము !!రా!!
పరమపదమును చేరుటకు దారి చూపునది ఈ
రామ నామము !!రా!!
అంబరీషుని పూజలకు కైవల్యమొసగిన రామ
నామము !!రా!!
తల్లివలె రక్షించు సుజనులనెల్లకాలము
రామ నామము !!రా!!
మంగళా శాసన...
సంధ్యాకాలంలో దీనితోటే నమస్కారం
చేయాలి శంకరాచార్యులవారికి
దీన్ని ఇంటిదగ్గర కూడా పారాయణ
చేయవచ్చును
తోటకాష్టకం
1 విధితాఖిల శాస్త్ర సుధాజలదే
మహితోపనిషద్కధితార్ధనిధే
హృదయే కలయే విమలం చరణం
భవ శంకరదేశిక మే శరణం
2 కరుణా వరుణాలయ పాలయమాం
భవ సాగర దు:ఖ విదూనహృదం
రచయాఖిలదర్శన తత్వ విధం
భవ శంకరదేశిక మే శరణం
3 భవతా జనతా సు హితా భవితా
నిజబోధ విచారణ చారుమతే
కలయేశ్వర జీవవివేకవిధం
భవ శంకర దేశిక మే శరణం
|
4 భవమేవ భవానితి మే నితరాం
సమజాయత చే తసి కౌ తు కితాం
మమ వారయమోహ మహాజలధిం
భవ శంకర దేశిక మే శరణం
5 సుక్రుతే ధిక్రుతే బహుదా భవతో
భవితా సమ దర్శన లాలసతా
అతిదీనమిమం పరిపాలయమాం
భవ శంకరదేశిక మే శరణం
6 జగతీమవితుం కలితా కృతయో
విచరంతి మహామహ సచ్చలత:
అహిమామ్షు హృదాత్త విభాసి గురో
భవ శంకరదేశిక మే శరణం
7 గురుపుంగవ పుంగవ కేతనతే
సమతాం మయతాం నహి కోపి సుధీ:
శరణాగత వత్సల తత్వనిధే
భవ శంకరదేశిక మే శరణం
8 విధితానమయా విషదైక కలా
నచకించన కాంచనమస్తి గురో
ద్రుతమేవ విధే హి క్రుపాంసహజాం
భవ శంకరదేశిక మే శరణం
No comments:
Post a Comment